దైవసాక్షిగా... చంద్రబాబు ప్రమాణం, ఈలలేశారు
విజయవాడ/గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం రాత్రి గం.7.27 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇందుకోసం నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానం ముస్తాబు అయింది. కిలోమీటర్ల పరిధి పసుపుమయమైంది.
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి బిజెపి అగ్రనేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, పలువురు కేంద్రమంత్రులు, ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. హీరోలు జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్లు వస్తున్నారు. వైయస్ జగన్, కెసిఆర్, రఘువీరా రెడ్డిలకు ఆహ్వానం అందినప్పటికీ వివిధ కారణాల వల్ల హాజరు కావడం లేదు.

సరిగ్గా ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు చంద్రబాబు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన దైవసాక్షిగా ప్రమాణం చేశారు. గవర్నర్ నరసింహన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. చంద్రబాబు ప్రమాణం సమయంలో అభిమానులు, కార్యకర్తలు కేరింతలు కొట్టారు, ఈలలు వేశారు. చంద్రబాబు తర్వాత కెఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, అయ్యన్నపాత్రుడు, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, దేవినేని ఉమామహేశ్వర రావు, పి నారాయణ, పరిటాల సునిత, పత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస రావు, పల్లె రఘునాథ్ రెడ్డి, పీతల సుజాత, అచ్చెన్నాయుడు, శిద్దా రాఘవ రావు, మృణాళిని, కొల్లు రవీంద్ర, రావెల కిశోర్, మాణిక్యాల రావులు ప్రమాణ స్వీకారం చేశారు.
వేదిక పైకి గవర్నర్ నరసింహన్ వచ్చారు. చంద్రబాబుతో ఆయన ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
చంద్రబాబును పవన్ ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్ వస్తారనుకున్నప్పటికీ హాజరు కాలేదు.
వేదిక పైకి అద్వానీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు తదితరులు వచ్చారు. ప్రమాణ స్వీకారానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ హాజరయ్యారు.
రవిశంకర ప్రసాద్ చంద్రబాబును శాలువాతో సన్మానించారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తెలంగాణ టిడిపి నేతలు హాజరయ్యారు. సభా ప్రాంగణానికి చేరుకున్నారు. నామా నాగేశ్వర రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మోత్కుపల్లి నర్సింహులు ఉన్నారు.
చంద్రబాబు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అందరికీ అభివాదం తెలిపారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి జిఎమ్మార్ హాజరయ్యారు.
విభజన బిల్లులో ఏపీకి అన్యాయం జరిగిందని బిజెపి అగ్రనేత అద్వానీ అన్నారు. గన్నవరంలో ఆయన మాట్లాడారు. బిల్లులో అన్యాయం జరిగినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసే సత్తా చంద్రబాబుకు ఉందని తెలిపారు.
బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్, ఆధ్యాత్మిక గురువు రవిశంకర్, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడులు సభాస్థలికి చేరుకున్నారు.
పవన్ కళ్యాణ్ బస చేసిన హోటల్ వద్దకు భారీగా అభిమానులు, కార్యకర్తలు వచ్చారు. దీంతో తోపులాట జరిగింది. పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

శివసేన అధినేత ఉద్దవ్ థాకరే గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.
ప్రచారంలో తాము ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తామని టిడిపి నేతలు దేవినేని ఉమ తదితరులు చెప్పారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ హాజరయ్యారు.
చంద్రబాబు విడిది కేంద్రం నుండి సభాస్థలికి బయలుదేరారు. కార్యక్రమానికి లక్షలాది మంది కార్యకర్తలు తరలి వచ్చారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.
రాజస్థానం సిఎం వసుంధరా రాజే, కేంద్రమంత్రులు అశోక గజపతి రాజు, ప్రకాశ్ జవదేకర్, రాజ్ నాథ్ సింగ్ బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ, నాగాలాండ్ ముఖ్యమంత్రి తదితరులు చేరుకున్నారు.
కేంద్రమంత్రులు రోడ్డు మార్గంలో బయలుదేరారు.
చంద్రబాబుకు దుర్గగుడి పూజారులు ఆశీర్వాదాలు ఇచ్చారు.

కేంద్రమంత్రుల బృందం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.
సాంస్కృతిక కార్యక్రమాలని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు. సభాస్థలి వద్దకు లక్షలాది మంది కార్యకర్తలు తరలి వస్తున్నారు. పోలీసులు ట్రాఫిక్ నియంత్రించేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ, నారా రోహిత్, కళ్యాణ్ రామ్ తదితర నందమూరి కుటుంబ సభ్యులు సభాస్థలి విడిది వద్దకు చేరుకున్నారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరులు సభా స్థలికి చేరుకున్నారు. ఇప్పటికే పలువురు విఐపిలు చేరుకున్నారు. చంద్రబాబు విడిది సభాస్థలికి దగ్గర్లోనే ఏర్పాటు చేశారు.
గన్నవరం విమానాశ్రయం నుండి గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ సభాస్థలికి బయలుదేరారు.

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న ప్రమాణ స్వీకార ప్రాంగణానికి గన్నవరం నుండి బయలుదేరారు.
చంద్రబాబుకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు బాటలు వేస్తారని ఆశిస్తున్నానని, కేంద్రం సహకరిస్తుందని తెలిపారు.
ఎండ వేడికి తాళలేక విఐపి గ్యాలరీలోకి వచ్చిన తెలుగు తమ్ముళ్లను పోలీసులు బయటకు పంపించారు.
చంద్రబాబు ప్రమాణం చేసే సభాస్థలి వద్ద పోలీసులు ఆంక్షలు విధించారు. దీనిపై తెలుగు తమ్ముళ్లు మండిపడ్డారు. కుర్చీలు విరగ్గొట్టి నిరసన తెలిపారు.
నాగార్జున వర్సిటీ చేరుకున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబుకు బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణస్వీకారోత్సవానికి చంద్రబాబు తనను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపథంలో నడుస్తుందని ఆశిస్తున్నాని వివేక్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీతకు వివేక్ శుభాకాంక్షలు తెలియజేశారు.
చంద్రబాబు నాయుడు గన్నవరం నుండి నాగార్జున విశ్వవిద్యాలయ ఎదురుగా ఉన్న ప్రమాణ స్వీకారోత్సవ ప్రాంగణానికి బయలుదేరారు.
బాబు ప్రమాణ స్వీకారానికి గన్నవరం వచ్చిన పంజాబ్ సిఎం ప్రకాశ్ సింగ్ బాదల్ వెటర్నరీ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన పశు ప్రదర్శనను సందర్శించారు.
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విజయవాడ చేరుకున్నారు. గన్నవరం విమానశ్రయంలో దిగిన పవన్ కాసేపట్లో గుంటూరు చేరుకోనున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి పలువురు ప్రముఖులు రావడం హర్షనీయమని పవన్ అన్నారు.చంద్రబాబు సమర్ధవంతమైన పరిపాలన అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
గుజరాత్ సిఎం ఆనందీ బెన్ పటేల్ గుంటూరు చేరుకున్నారు.
కడప జిల్లా నుండి ఎవరికీ చోటు దక్కలేదు. కృష్ణా జిల్లా నుండి అధికంగా ముగ్గురుకి చోటు దక్కింది.
బాబు కేబినెట్లో ముగ్గురు మహిళలకు చోటు దక్కింది. కాంగ్రెసు నుండి వచ్చిన గంటా శ్రీనివాస రావుకు చోటు దక్కింది. బిజెపి నుండి ఇద్దరిని కేబినెట్లోకి తీసుకున్నారు.
చంద్రబాబుతో పాటు 19 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కెఈ కృష్ణమూర్తి, చినరాజప్పలకు ఉప ముఖ్యమంత్రి కేటాయించినట్లుగా తెలుస్తోంది.
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించాక చంద్రబాబు విజయవాడకు బయలుదేరారు.
చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి తరలివస్తున్న ప్రముఖులు, ప్రజాప్రతినిధులతో గన్నవరం విమానాశ్రయం సందడిగా మారింది. వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఎయిర్ పోర్టు వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. గన్నవరం విమానాశ్రయం నుంచి సభాస్థలి వరకు ఉన్న రహదారిని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు.
చంద్రబాబు కేబినెట్లో పరిటాల సునీత, పీతల సుజాతలకు చోటు దక్కే అవకాశముంది. మత్స్యకారుల వర్గం నుండి రవీంద్రకు చోటు దక్కవచ్చు.
చంద్రబాబు ఇంటి నుండి ఎన్టీఆర్ ఘాట్ చేరుకున్నారు. అక్కడ నివాళులు అర్పించి గన్నవరం బయలుదేరుతారు.
పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతున్నారు. ఆయన పదకొండు గంటలకు గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు.
హరికృష్ణ కుటుంబ సభ్యులు ఉదయం నిమ్మకూరుకు చేరుకొని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. హరికృష్ణ, జూ ఎన్టీఆర్, కళ్యాణ్ రాంలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు. మావయ్య చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి తనకు ఆహ్వానం అందిందని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం... అదీ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుందటం గర్వంగా ఉందన్నారు. కొత్త రాష్ట్రానికి మామయ్య తొలి ముఖ్యమంత్రి కావడం గర్వకారణమన్నారు. తాను కుటుంబ సభ్యులతో ప్రమాణ స్వీకారాన్ని తిలకించబోతున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications