జగన్ మంత్రికీ లోన్ యాప్ వేధింపులు-అప్పు తీసుకోకుండానే ! నలుగురి అరెస్ట్
ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా లోన్ యాప్ వేధింపులపై చర్చ జరుగుతోంది. ఇప్పటివరకూ సాధారణ ప్రజల్నే టార్గెట్ చేసిన లోన్ యాప్ నిర్వాహకులు ఇప్పుడు ప్రముఖులపైనా కన్నేశారు. వారిని ట్రాప్ చేయడం సులువని భావిస్తున్నారో లేక చెప్పుకోలేక తమకు లొంగిపోతారని భావిస్తున్నారో తెలియదు కానీ ప్రముఖుల్ని సాఫ్ట్ టార్గెట్స్ గా మార్చుకుంటున్నారు. ఇదే క్రమంలో ఏపీలోనూ కొందరు ప్రముఖులు లోన్ యాప్ వేధింపుల బారిన పడుతున్నారు.
ఏపీలో వైఎస్ జగన్ కేబినెట్ లో వ్యవసాయమంత్రిగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి తాజాగా లోన్ యాప్ బాధితుల జాబితాలో చేరినట్లు తెలుస్తోంది. అయితే ఆయన లోన్ తీసుకోకుండానే ఈ యాప్ బాధితుడిగా మారడం విశేషం. లోన్ తీసుకోకపోయినా అశోక్ అనే లోన్ తీసుకున్న మహానుభావుడి ఫోన్ లో మంత్రిగారి నంబర్ ఉందన్న కారణంతో ఆయన ఫోన్ కు వేధింపు కాల్స్ మొదలయ్యాయి. దీంతో మంత్రి గారి పీఏ శంకర్ ఈ ఫోన్ కాల్స్ ను లిఫ్ట్ చేయడం, తమకు సంబంధం లేదని చెప్పినా వినకుండా బూతులు తిట్టడం మొదలైంది.
లోన్ యాప్ నిర్వాహకుల నుంచి తరచూ ఫోన్ కాల్స్ రావడం, డబ్బులిస్తారా లేదా అంటూ తిడుతుండటంతో మంత్రి గారి పీఏ శంకర్..ఈ గోలంతా ఎందుకని ఓ పాతికవేలు సమర్పించుకున్నట్లు తెలుస్తోంది. అయినా కాల్స్ ఆగకపోవడంతో నెల్లూరులోని ముత్తుకూరు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కోల్ మాన్ ఫైనాన్స్ కంపెనీ నుంచి డబ్బు రికవరీ కోసం ఫోన్ కాల్స్ వచ్చినట్లు గుర్తించారు. ఈ సంస్థ నుంచి 8.50 లక్షల లోన్ తీసుకున్న అశోక్ అనే వ్యక్తి ఫోన్ లో ఉన్న వారికి ఈ వేధింపు కాల్స్ వెళ్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే మంత్రి గారి ఫోన్ కూ కాల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో చెన్నైకి చెందిన నలుగురు రికవరీ ఏజంట్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి లాప్ టాప్, నాలుగు మొబైల్స్, పదివేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.