ఆపరేషన్ వెంకటేశ్వర్లు సక్సెస్: 8 గంటల పాటు తాడిచెట్టు ఎక్కి కూర్చున్నాడు
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు చిలకలూరి పేట కుప్పగంజి వాగులో చిక్కుకుపోయిన వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఎట్టకేలుకు సురక్షితంగా బయటపడ్డాడు.
గురువారం ఉదయం కుప్పగంజి వాగులో చిక్కుకుపోయిన వెంకటేశ్వర్లను దాదాపు 8 గంటల పాటు వాగులో చిక్కుకుపోయాడు. ఆ తర్వాత వరద నీరు మరింత పెరుగుతుండటంతో తాడి చెట్టు పైకి ఎక్కి దానిని పట్టుకుని నిలబడ్డాడు. అలా అతను సుమారు 8 గంటల పాటు నిలబడ్డాడు.
ఈ క్రమంలో అతడిని రక్షించేందుకు వెళ్లిన మరో వ్యక్తిని కూడా వాగులో చిక్కుకుపోయాడు. దీంతో స్థానికులు రంగం ప్రవేశం చేసి తాడు సాయంతో ఇద్దరినీ రక్షించారు. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లాలో ఉదయం నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో చిలకలూరి పేట సమీపంలో కుప్పగంజి వాగులో వరద ఉధృతి పెరిగింది.
అదే సమయంలో అక్కడకు వెళ్లిన వెంకటేశ్వర్లు అనే యువకుడు ఆ వరద ఉధృతిలో కొట్టుకుపోయాడు. దీంతో అతడిని కాపాడేందుకు ప్రయత్నాలు కొనసాగాయి. వెంకటేశ్వర్లు బంధువు ఒకతను తన ప్రాణాలకు తెగించి అతడిని కాపాడేందుకు వెళ్లాడు. అయితే వరద ఉధృతి మరింతగా పెరగడంతో అతను చిక్కుకుపోయాడు.
దీంతో స్థానికుల్లో టెన్షన్ పెరిగింది. ఎలాగైనా వీరిని కాపాడాలనే నిర్ణయానికి వచ్చారు. చివరకు తాళ్ల సాయంతో వెంకటేశ్వర్లతో పాటు వాగులో చిక్కుకుపోయిన మరో వ్యక్తిని కాపాడగలిగారు. అనంతరం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ రాత్రి నుంచి వర్షాలు పడుతున్నాయని చెప్పాడు.
గురువారం ఉదయం టిఫిన్ చేసి చూసే సరికే వరద పెరగడంతో పక్కనే ఉన్న తన తాతయ్య ఊరు అవిశాయపాలెం వెళ్లేందుకు బయల్దేరానని చెప్పాడు. కొంచెం దూరం వచ్చే సరికే వరద ఉధృతి అమాంతం పెరిగి తాను నీళ్లలో మునిగి పోయానని చెప్పుకొచ్చాడు. నీళ్ల ప్రవాహం మధ్యలో అలా కొట్టుకుపోతుండగా తాడి చెట్టు తగిలిందని, దానిని ఎక్కి పట్టుకుని అలా 8 గంటల పాటు ఉన్నానని చెప్పాడు.
ఉదయం 9 గంటల నుంచి ఇక్కడే ఉన్నానని, నన్ను కాపాడినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. ఇక్కడే వాగు వద్ద కాపలా ఉంటామని, తొందరగా రమ్మన్నారని చెప్పాడు. తనకు ఈత వచ్చని, ఈత కొట్టుకుంటా చెట్టు ఎక్కి కూర్చున్నానని చెప్పాడు. తనను కాపాడాతారని నమ్మకం ఉందని, వరద తగ్గిన తర్వాత వద్దామని అనుకున్నానని చెప్పాడు.
మధ్యలో తాను చనిపోతాననే అనుమానం కలిగిందని, కానీ తన బాబాయి ఈదుకుంటూ తన దగ్గరకు వచ్చి ధైర్యం చెప్పి స్థానికులను తీసుకొచ్చాడని తెలిపారు. తనకు సాయం చేసిన వారికి ముఖ్యంగా మీడియాకు, పోలీసులకు స్థానికులకు జన్మజన్మలా రుణపడి ఉంటానని తెలిపాడు. ప్రస్తుతం తనకు మాటలు రావడం లేదని ఆకలిగా ఉందని అన్నాడు.
దీంతో అక్కడే ఆ యువకుడికి స్థానికులు అన్నం పెట్టారు. యువకుడిని రక్షించే సన్నివేశాలను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. గుంటూరు జిల్లాలకు చెందిన మంత్రి పత్తిపాటి పుల్లారావు అక్కడికి చేరుకుని యువకుడిని కాపాడాలని ఆదేశించారు. అవసరమైతే హెలికాప్టర్ ద్వారా అతడిని కాపాడాలని సూచించారు.
ఇలోపే అతడిని స్థానికులు తాళ్ల సాయంతో రక్షించారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లోనూ మరో మూడురోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటిచింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.