దాడి: మణిపూర్ ఎన్ఐటీలో తెలుగువారు బిక్కుబిక్కు
ఇంపాల్/హైదరాబాద్: మణిపూర్లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో తెలుగు విద్యార్థుల పైన స్థానిక విద్యార్థులు దాడికి పాల్పడుతున్నారని తెలుస్తోంది. స్థానికేతరులైన మీరు తమకు అణిగిమణిగి ఉండాలని వారు దాడికి పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది.
బాధితులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారితో పాటు బీహార్ విద్యార్థులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలీసులకు, యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన సరైన స్పందన రావడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పదుల విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
తమతో పాటు బీహార్ వాసుల పైన కూడా స్థానిక విద్యార్థులు దాడులకు తెగబడుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. తాము ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని చెబుతున్నారు. ప్రాంతీయ విద్వేషాలు సాధారణమే అయినప్పటికీ.. ఇటీవల తమ పైన వారు దాడికి పాల్పడుతున్నారని చెబుతున్నారు.
నిన్న రాత్రి నుండి అయితే తాము గదుల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని చెబుతున్నారు. మణిపూర్ ముఖ్యమంత్రి కళాశాలను సందర్శించారని, తమను, స్థానిక విద్యార్థులను కూర్చుండబెట్టి మాట్లాడారని చెప్పారు. తాము వెళ్లిపోతామని చెబితే, అది సరికాదని, మీ భద్రత కోసం ఏం చేయాలో చెప్పాలని అడిగారని విద్యార్థులు చెబుతున్నారు.
మణిపూర్లో తెలుగు విద్యార్థుల సంఘటన పైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు స్పందించాయి. ఈ ఘటన పైన తెలంగాణ, ఏపీల డీజీపీలు ఆరా తీశారు. మణిపూర్ డీజీపీకి ఫోన్ చేసి వివరాలు అడిగారు. నిన్నటి వరకు పరిస్థితి ఆందోళనగా ఉన్నప్పటికీ ప్రస్తుతం అదుపులో ఉందని మణిపూర్ డీజీపీ చెప్పారని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. విద్యార్థులకు రక్షణ కల్పిస్తున్నట్లు చెప్పారన్నారు. మరోవైపు, విద్యార్థుల ఇబ్బందులపై ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి మణిపూర్ ప్రభుత్వంతో మాట్లాడారు.