నారా వర్సెస్ నార్నే : మంగళగిరి నుండి లోకేష్ : సిసలైన ఎన్నికల మజా..!
Recommended Video
ఏపిలో సిసలైన రాజకీయానికి తెర లేచింది. ముఖ్యమంత్రి తనయుడు..మంత్రి లోకేష్ ను రాజధాని ప్రాంతం నుండి పోటీ కి దింపాలని చంద్రబాబు నిర్ణయించారు. ఆయన విశాఖ జిల్లా నుండి పోటీ చేస్తుందని భావించినా చివరకు ఆయనకు మంగళగిరి సీటు ఖరారు చేసారు. ఇదే సమయంలో వైసిపి సైతం వ్యూహాత్మక ఎత్తుగడ వేసింది. లోకేష్ పై పోటీకి ఊహిం చని విధంగా కొత్త అభ్యర్ధిని తెర మీదకు తెచ్చింది..
మంగళగిరి నుండి లోకేష్ పోటీ..
మంత్రి నారా లోకేష్ ఈ ఎన్నికల్లో మంగళగిరి నుండి పోటీ చేయటం ఖాయమైంది. కొంత కాంగా లోకేష్ పోటీ చేసే స్థానం పై రకరకాలుగా ప్రచారం సాగింది. తొలుత భీమిలి నుండి చేస్తారని ఆ తరువాత విశాఖ నార్త్ నుండి పోటీ లో ఉంటారని ప్రచారం సాగింది. అయితే, రాజధాని ప్రాంతమైన మంగళగిరి నుండి పోటీ చేయాలని లోకేష్ కు చంద్రబాబు సీటు ఖరా రు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఎమ్మెల్సీగా ఉంటూ మంత్రి పదవి దక్కించుకున్న లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయటం ఇదే తొలి సారి. దొడ్డి దారిన మంత్రి పదవి దక్కించుకున్నారని లోకేష్ పై అనేక రకాలుగా ప్రతి పక్ష నేతలు విమర్శలు గుప్పించారు. ఇప్పుడు రాజధాని ప్రాంతమైన మంగళగిరి నుండి పోటీ చేయటం ద్వారా ఈ సీటు రాజకీయంగా హాట్ సీటుగా మారింది.
నార్నే వర్సెస్ నారా..!
ఇక, లోకేష్ మంగళగిరి నుండి బరిలోకి దిగుతుండటంతో వైసిపి సైతం వ్యూహాత్మక ఎత్తుగడ వేస్తోంది. ఇప్పటి వరకు ఆ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ల రామకృష్ణా రెడ్డికి తిరిగి సీటు ఇవ్వాలా ..వద్దా కొత్త వారిని ఇప్పుడు బరి లోకి తీసుకురావాలా అనే అంశం పై చర్చలు జరిపింది. ఇదే సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే సైతం జగన్ కే నిర్ణయా ధికారం వదిలేసారు. ఇప్పుడు వైసిపి కొత్త ఎత్తుగడ పై దృష్టి సారించింది. మంగళగిరి నుండి లోకేష్ పై పోటీకి జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావును బరిలోకి దించే ప్రతిపాదన పై ఆలోచన చేస్తోంది. కొద్ది రోజుల క్రితమే ఆయన వైసిపి లో చేరారు. జగన్ ఎక్కడి నుండి పోటీ చేయమని చెబితే అక్కడి నుండి చేస్తానని చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు నార్నే శ్రీనివాస రావును మంగళగిరి నుండి బరిలోకి దించుతారని విశ్వసనీయ సమాచారం.
సిసలైన రాజకీయం మొదలు..
మంగళగిరి లో 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్ధి ఆళ్ల రామకృష్ణా రెడ్డి 12 ఓట్ల మెజార్టీతో టిడిపి అభ్యర్ధి గంజి చిరంజీవి పై గెలుపొందారు. అప్పటి నుండి మంగళగిరి టిడిపి ఇన్ఛార్జ్ గా గంజి చిరంజీవి ఉన్నారు. తాజాగా టిడిపి లో అక్కడ నుండి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల చేరారు. బిసి లు ముఖ్యంగా చేనేత వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో చేనేత వర్గానికి చెందిన వారికి సీటు ఇస్తారని భావించారు. అయితే, సడన్ గా లోకేష్ పేరు ఖరారు చేయటంతో అక్కడి నుండి వైసిపి సైతం అదే సామాజిక వర్గం..అదే కుటుంబం తో బంధుత్వం..జిల్లా కే చెందిన నార్నే శ్రీనివాస రావును బరిలోకి దింపటం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో..ఇప్పుడు మంగళగిరి సీటు ఈ ఎన్నికల్లో హాట్ సీట్ గా మారుతోంది.