25 వేల కోట్ల అక్రమ మద్యం దందా ; జగన్ రెడ్డికి పోలీసులు ఏం శిక్ష వేస్తారో ? లోకేష్ ప్రశ్న
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమాయకులపై వేధింపులు పెరిగిపోయాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాజాగా పోలీసుల టార్చర్ తట్టుకోలేక రాజమండ్రికి చెందిన చేనేత వర్గానికి చెందిన యువకుడు మరణించిన ఘటనపై లోకేష్ ధ్వజమెత్తారు. ఏపీలో పోలీసుల దారుణాలు పెరిగిపోతున్నాయని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పోలీసుల వేధింపులతో ఆత్మహత్యలకు యువకులు పాల్పడడం నిత్యకృత్యంగా మారింది అని పేర్కొన్న లోకేష్ అక్రమ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ అయిన వైయస్ జగన్ ధన దాహానికి యువకులు బలైపోతున్నారు అంటూ నిప్పులు చెరిగారు.
నిరుద్యోగులు ఉరేసుకునే పరిస్థితి ; జగన్ రెడ్డి సూసైడ్ చేసుకున్న కమల్ ను తీసుకురాగలరా : లోకేష్ ధ్వజం
పోలీసుల వేధింపులు తట్టుకోలేక యువకులు ఆత్మహత్యలు
అంతేకాదు ఎక్సైజ్ పోలీసుల వేధింపులు తట్టుకోలేక గుంటూరు జిల్లా భట్రుపాలెంలో మైనారిటీ సోదరుడు అలీషా ఆత్మహత్య చేసుకున్న ఘటన మరిచిపోకముందే రాజమండ్రిలో పోలీసుల టార్చర్ తట్టుకోలేక చేనేత వర్గానికి చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఆత్మహత్యకు ముందు చేనేత యువకుడు మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు నారా లోకేష్. పిచ్చుక మజ్జి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని పేర్కొన్న లోకేష్ పక్క రాష్ట్రం రెండు రెండు మద్యం బాటిళ్లు తెచ్చినందుకు ఆత్మహత్య చేసుకునేంతగా పోలీసులు అతన్ని వేధించారని ఆరోపించారు.
మద్య నిషేధం మాటున 25 వేల కోట్ల మద్యం అక్రమ దందా చేస్తున్న జగన్ రెడ్డి
కేవలం పక్క రాష్ట్రం నుండి రెండు మద్యం బాటిళ్లు తెచ్చినందుకే ఇంతగా వేధించిన పోలీసులు మద్య నిషేధం మాటున 25 వేల కోట్ల మద్యం అక్రమ దందా చేస్తున్న జగన్ రెడ్డికి ఏం శిక్ష వేస్తారో చెప్పాలని లోకేష్ నిలదీశారు. ఇద్దరు యువకుల మృతికి కారణమైన పోలీసులపై ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని, తక్షణమే మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ పిడింగొయ్యి గ్రామంలో చేనేత కుటుంబానికి చెందిన పిచ్చుక మజ్జి అనే యువకుడిని పోలీసులు స్టేషన్ కు పిలిపించుకుని లక్ష లంచం డిమాండ్ చేసి, ఇవ్వకపోతే గంజాయి అక్రమ రవాణా కేసు పెడతామని బెదిరిస్తే.. ఆ యువకుడు ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు అని పోలీసుల వేధింపులకు చేనేత యువకుడు బలైపోయాడని టిడిపి మహిళా నాయకురాలు పంచుమర్తి అనురాధ విమర్శించారు.
పిచ్చుక మజ్జి ఆత్మహత్యపై టీడీపీ నేతల ధ్వజం
ఇంతజరిగినా... తాను నేతన్నకు నేస్తాన్ని అంటూ కొద్దిరోజులుగా ప్రచారంతో ఊదరగొడుతున్న జగన్ రెడ్డి స్పందించలేదని పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. రాష్ట్ర హోమ్ మంత్రి సరేసరి. ఇదేనా చేనేతలకు జగన్ రెడ్డి చేస్తోన్న న్యాయం అని ప్రశ్నించారు తెలుగుదేశం మహిళా నేత పంచుమర్తి అనురాధ. అంతేకాదు టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేనేత యువకుడి ఆత్మహత్యపై, ఇంత సంఘటన జరిగితే ముఖ్యమంత్రి గారు స్పదించక పోవడం దారుణం. రాజమండ్రి రూరల్ పీడింగొయ్యి గ్రామానికి చెందిన పిచ్చుక మజ్జి అనే యువకుడు పోలీసుల వేధింపులకి తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకున్నాడు.ఈ విషయం మీకు కనపడలేదా వైయస్ జగన్ అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర హోంమంత్రి సుచరిత ఏం చేస్తున్నట్లు అంటూ నిలదీశారు.