జగన్ అనే నేను అంటూ కోతలరాయుడు: ఇంత మాయ చేస్తారు కాబట్టే ఏ-1గా: లోకేశ్ సెటైర్లు..!
ముఖ్యమంత్రి జగన్ పైన మాజీ మంత్రి లోకేశ్ ట్వీట్ల ద్వారా టార్గెట్ చేసారు. జగన్ పైన తీవ్ర విమర్శలు చేసారు. తాజాగా ఏపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితుల కోసం రూ.264 కోట్లు విడుదల చేసింది. ఎన్నికల హామీలో భాగంగా అగ్రిగోల్డ్ రైతులకు రూ. 1150 కోట్లు చెల్లిస్తామని నాడు హామీ ఇచ్చారు. సంస్థ ఆస్తులను ఆ తరువాత కోర్టు అనుమతితో వేలం వేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది..ముందుగా బాధితులకు నష్టపోయిన నగదు చెల్లిస్తామని చెప్పుకొచ్చింది. అందులో భాగంగా తొలుత పది వేల వరకు డిపాజిట్ చేసి నష్టపోయిన బాధితుల కోసం ఈ మొత్తాన్ని విడుదల చేసింది. అయితే, దీని పైన ఇప్పుడు మాజీ మంత్రి లోకేశ్ ముఖ్యమంత్రి జగన్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసారు. గతంలో తాము అధికారంలో ఉన్న సమయంలో రూ.336 కోట్లు విడుదలకు సిద్దమైన విషయాన్ని గుర్తు చేసారు.
కోతలరాయుడుగారూ..అందుకే ఏ-1 కాగలిగారు..
లోకేశ్ తన ట్వీట్ల ద్వారా తాజాగా ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితుల కోసం విడుదల చేసిన నిధుల పైన స్పందించారు. జగన్ అనే నేను.. అంటూ కోతల రాయుడుగారు ఎన్నికల ముందు ఏమేం కోతలు కోశారు.. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను ఎలా కోతలకు గురి చేస్తున్నారో చూడండి... అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే, అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1100 కోట్లు ఇస్తామని ఆనాడు చెప్పారు...అంటూ లోకేశ్ గుర్తు చేసారు.

దీనికి కొనసాగింపుగా..మరిప్పుడు ఐదు నెలల తర్వాత రూ.264 కోట్లు మాత్రమే ఇస్తామంటారేంటి? అంటే కోతకు గురైన రూ.836 కోట్లను ఇంకో నెలలో ఇచ్చేసి మాట నిలబెట్టుకుంటారా? అయినా తెదేపా హయాంలోనే 6.49 లక్షల మందికి, రూ.336 కోట్లు ఇచ్చేందుకు సిద్ధం చేసామంటూ పేర్కొన్నారు. మరో ట్వీట్ లో ..వైసీపీ వేసిన కోర్టు కేసుల మూలంగా తెదేపా ఇవ్వలేకపోయిన ఆ రూ.336 కోట్ల నుండే రూ.264 కోట్లు ఇస్తూ ఇంకా రూ.72 కోట్లను మిగుల్చుకున్నారు. వాహ్! జగన్ గారు! ఇంత మాయ చేస్తారు కాబట్టే మీరు గౌరవనీయ ఏ-1 కాగలిగారు...అంటూ ట్వీట్ చేసారు.
ప్రభుత్వం ఏం చెబుతోంది..
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని విపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చారు. అందుకోసం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.1150 కోట్ల విడుదల చేస్తామని చెప్పారు. మొత్తం ఆరు నెలల కాలంలో ఈ మొత్తం చెల్లిస్తామన్నారు. అందులో భాగంగా తొలి విడతగా రూ.264 కోట్లు విడుదల చేసింది. జగన్ తాను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే మరో నెల రోజుల్లో రూ 836 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే, గత ప్రభుత్వం కేవలం ఎన్నికల సమయం జీవో జారీ చేసింది కానీ, నిధులు విడుదల చేయలేదని వైసీపీ చెబుతోంది.
తాము బాధితులకు ఇచ్చిన మాట కోసం ఇప్పుడు నిధులు విడుదల చేస్తున్నామని..భవిష్యత్ లో చెప్పిన విధంగా మిగిలిన మొత్తం కూడా బాధితులకు అందిస్తామని మంత్రి కన్నబాబు స్పష్టం చేసారు. తొలి దశలో పది వేల వరకు డిపాజిట్లు చేసి నష్టపోయిన వారికి నిధులు అందించామని..తరువాతి దశలో ఇదే విధంగా మరో మొత్తం వరకు కటాఫ్ ఎమౌంట్ గా గుర్తించి నిధులు విడుదల చేస్తామని వివరించారు.












Click it and Unblock the Notifications