జీతాల కోసం మున్సిపల్ కార్మికుల ఆందోళన, అరెస్ట్ లతో ఉద్రిక్తం.. జగన్ సర్కార్ పై లోకేష్ సీరియస్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ సర్కార్ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. గత ఐదు నెలలుగా మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. జీతాలు లేక కార్మికులు ఆందోళన బాట పట్టారని పేర్కొన్న నారా లోకేష్ మున్సిపల్ కార్మికులకు బకాయి ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
జీతాల కోసం ఆందోళన చేస్తే నేరమా ? ఇది రాజారెడ్డి రాజ్యంగమా ?
సోషల్ మీడియా వేదికగా మున్సిపల్ కార్మికుల ఆందోళన పై పోస్ట్ చేసిన లోకేష్ నాలుగు రోజులు రిలే నిరాహార దీక్షలు చేసినా పట్టించుకోకపోగా, కనీసం కార్మికుల సమస్య గురించి వినడానికి కూడా ఉన్నతాధికారులకు మనసు రాలేదంటూ ఫైర్ అయ్యారు. వెంటనే మున్సిపల్ కార్మికులు బకాయి ఉన్న జీతాలు చెల్లించాలని, అరెస్టు చేసిన కార్మికులను తక్షణం విడుదల చేయాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. న్యాయబద్ధంగా మున్సిపల్ కార్మికులు తమకు రావాల్సిన జీతాల కోసం నిరసన తెలపడం కూడా రాజారెడ్డి రాజ్యాంగంలో నేరమేనా అంటూ ప్రశ్నించారు లోకేష్.
కార్మికుల జీతాలు ఇవ్వకుండా అరెస్ట్ చేసి జైలుకు పంపటంపై లోకేష్ సీరియస్
మంగళగిరి నగరపాలక సంస్థ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు గత ఐదు నెలలుగా జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ పేర్కొన్న లోకేష్, ఆందోళన చేస్తున్న కార్మికులను అరెస్టు చేసి జైలుకు పంపించడం వైయస్ జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వానికి పరాకాష్ట అంటూ మండిపడ్డారు. దొంగలను పెట్టినట్టు కార్మికులను లాకప్ లో బంధించటం వైసీపీ ప్రభుత్వ దుర్మార్గపు చర్య అని లోకేష్ విరుచుకుపడ్డారు. మున్సిపల్ కార్మికుల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్న లోకేష్ వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఐదు నెలల జీతం రాకపోతే వారికి కడుపు మండదా
జీతం వస్తే కానీ పూటగడవని జీవితాలు వారివని పేర్కొన్న లోకేష్ ఐదు నెలల జీతం రాకపోతే వారికి కడుపు మండదా అంటూ జగన్ సర్కార్ ను ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ ఆందోళన చేస్తున్న మున్సిపల్ కార్మికులను పోలీసులు అరెస్టు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన లోకేష్ వైసీపీ ప్రభుత్వం పై సీరియస్ అయ్యారు. వారిని తక్షణమే విడుదల చేయాలని, జీతాలను వెంటనే చెల్లించాలని లోకేష్ డిమాండ్ చేశారు.
మంగళగిరిలో మున్సిపల్ కార్మికుల ఆందోళన ఉద్రిక్తం .. కార్మికుల అరెస్ట్
గత ఐదు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో మంగళగిరి మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు ఆందోళన బాట పట్టారు. నాలుగు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న కార్మికులు ఈరోజు కార్యాలయంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే కార్మికులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది . పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు ఆందోళన చేస్తున్న కార్మికులు అరెస్ట్ చేశారు. మహిళా కార్మికులను సైతం పోలీసులు ఈడ్చుకెళ్ళారు. పది మంది కార్మికులను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని కోర్టులో హాజరు పరిచారు. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది.