ఈ పాపం ఆయన్ను ఊరికే వదలదు ... ఇళ్ళ కూల్చివేతపై మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేని టార్గెట్ చేసిన లోకేష్
వైసిపి నేత మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డిని టార్గెట్ చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈరోజు మంగళగిరి మండలం ఆత్మకూరు లో అక్రమ నిర్మాణాల పేరుతో ఇళ్లను కూల్చివేసిన ఘటనపై స్పందించిన లోకేష్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై నిప్పులు చెరిగారు.
మంగళగిరి మండలం ఆత్మకూరులో ఆక్రమణల తొలగింపు..బాధితుల ఆందోళనతో ఉద్రిక్తత
పేదల ఇళ్ళు కూల్చిన పాపం ఎమ్మెల్యే ఆర్కే కు వూరికే పోదన్న లోకేష్
గత ఎన్నికల సమయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి తాను గెలిస్తే మంగళగిరిలో పేదల ఇళ్ళు కూల్చేస్తామని తనపై అసత్య ప్రచారం చేసి గెలిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మానవత్వం లేకుండా ఆళ్ల రామకృష్ణా రెడ్డి రోజుకో చోట పేదల ఇళ్ళు కూల్చేస్తున్నారని లోకేష్ మండిపడ్డారు. పేద వారి ఇల్లు కూల్చిన పాపం ఆయన్ను ఊరికే వదలదని శాపనార్థాలు పెట్టారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఆత్మకూరు గ్రామంలో గత 40 ఏళ్లుగా నివాసముంటున్న పేదల ఇళ్ళను అక్రమ నిర్మాణాల పేర్లతో కూల్చడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని టిడిపి నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
రెండేళ్లలో ఒక్క ఇళ్ళు కూడా కట్టలేదని జగన్ సర్కార్ పై విమర్శలు
రెండేళ్లలో పేదలకు ఒక ఇల్లు కూడా కట్టని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలు కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను ఎలా ధ్వంసం చేశారు.. ఆ హక్కు ఎవరిచ్చారు అంటూ ప్రశ్నించారు. ఇళ్ళ సమస్య కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యే ఒత్తిడితో అధికారులు , పోలీసులు ప్రజలను కట్టుబట్టలతో నడి రోడ్డు మీదకు నెట్టేశారు అని నారా లోకేష్ ధ్వజమెత్తారు. రెవెన్యూ అధికారుల వల్ల గూడు కోల్పోయిన నిరుపేదలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని నారా లోకేశ్ స్పష్టం చేశారు.
న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్న లోకేష్
న్యాయం జరిగే వరకు టిడిపి పోరాడుతుందన్నారు. ఇక ఈ రోజు ఉదయం ఆత్మకూరులో పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాల పేరుతో నిరుపేదల ఇళ్లను కూల్చివేశారు. బాధితులు అడ్డుకున్నప్పటికీ, కన్నీటిపర్యంతమైన ప్పటికీ అధికారులు కూల్చివేతలను కొనసాగించారు. అధికారుల కూల్చివేతల నేపథ్యంలో బాధితుల ఆందోళనలతో ఆత్మకూరులో ఉదయం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.