ఆ విషయం తెలిసి!: యువతి ఆత్మహత్యాయత్నం, ఆ వెంటనే అతనూ..
నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురం మండలం బొర్రంపాలెంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. తను ప్రేమించిన వ్యక్తి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని యువతి పురుగుల మందు తాగగా.. ఎక్కడ తనపై కేసు అవుతుందోనన్న భయంతో ఆ యువకుడు కూడా పురుగుల మందు తాగాడు.
వివరాల్లోకి వెళ్తే.. బొర్రంపాలెం గ్రామానికి చెందిన నెల్లూరి పవన్(21), కాకిలేటి కిరణి(22) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఏమైందో తెలియదు కానీ రెండు నెలల క్రితం పవన్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
ఈ విషయం ఇటీవలే కిరణకి తెలిసింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన కిరణి.. పవన్కు ఫోన్ చేసి పురుగుల మందు తాగింది. కిరణి ఇచ్చిన సమాచారంతో అక్కడికెళ్లిన పవన్.. ఆమెను ఆ స్థితిలో చూసి షాక్ తిన్నాడు.
కిరణికి ఏమైనా అయితే తనపై కేసు నమోదవుతుందన్న భయంతో తాను కూడా పురుగుల మందు తాగాడు. ఈ ఇద్దరిని గమనించిన స్థానికులు చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరిద్దరు ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.