'ఎన్టీఆర్ తో లక్ష్మీ పార్వతి లవ్ స్టోరీ..' : ఆరోజుల్లోనే 3లక్షల ఫోన్ బిల్
ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించాక.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితురాలిగా మారిపోయిన లక్ష్మీ పార్వతి, ఎన్టీఆర్ తో తన అనుబంధం గురించి ఓ ప్రముఖ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. తెలుగు జనం అన్న గారిగా ఆరాధించే ఎన్టీఆర్ సినిమాల పట్ల విపరీతమైన అభిమానం చూపించేదాన్నని చెప్పిన లక్ష్మీ పార్వతి.. ఒకప్పుడు గుంటూరులో తాను రోజుకు మూడు అన్నగారి సినిమాలు చూసినట్టుగా చెప్పారు.
1989-1990లో హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో ఎంఏ చేస్తోన్న సమయంలో ఎన్టీఆర్ తో తనకు పూర్తి పరిచయం ఏర్పడినట్టుగా తెలిపిన లక్ష్మీ పార్వతి, చిన్నతనంలో తాను దేవుడిగా ఆరాధించిన వ్యక్తిని కాలేజీ రోజుల్లో మాత్రం లవర్ గా భావించేదాన్నని తెలియజేశారు.
సాముద్రిక శాస్త్రవేత్తలు చెప్పినదాని ప్రకారం.. పురాణాల్లో రాముడి లాగే, ఎన్టీఆర్ ఆహార్యం అద్భతంగా ఉండేదని చెప్పిన లక్ష్మీ పార్వతి, ఎన్టీఆర్ కళ్లు, ముక్కు, ఎత్తు.. మొత్తంగా ఆయన శరీరీ సౌష్టవం పర్ఫెక్ట్ గా ఉండేదని కితాబిచ్చారు.
ఢిల్లిలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాల వేడుకల్లో భాగంగా.. ప్రభుత్వ కార్యక్రమానికి హాజరైన సమయంలో కిషన్ రావు అనే అధికారి సహాయంతో ఒక గదిలో సేద తీరుతూ కాషాయ వర్ణంలో మెరిసిపోతున్న తన స్వామిని మొట్ట మొదటిసారిగా దర్శించుకున్నానని అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
'ఆరోజు ఆయన కాళ్లకు నేను నమస్కరించడం.. ఆయన నా భుజాలను పట్టుకుని పైకి లేపి.. నా కన్నీళ్లు తుడవడం..' ఇలా తమ తొలి పరిచయం సాగిందని వివరించారు. తొలిసారి పార్టీ పెట్టి తెనాలి వచ్చినప్పుడు.. ఎక్కడో జనంలో నిలబడి ఆయన్ను చూడడం కోసం శతవిధాల ప్రయత్నించానని.. అదే విషయం తొలిసారి ఎన్టీఆర్ ని కలిసినప్పుడు ఆయనతో చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నానని, దీంతో ఆయనే తన కన్నీళ్లు తుడిచి ఓదార్చారని చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత టీడీపీ మహానాడు సందర్భంగా.. ఎన్టీఆరే తనను గుర్తుపట్టి మరీ లక్ష్మీ పార్వతి అంటూ పిలిచారని.. ఆ సందర్భంగా తన అపాయింట్ మెంట్ కోరగా, దానికేం భాగ్యం అంటూ మర్నాడు అపాయింట్ మెంట్ ఫిక్స్ చేశారని చెప్పారు. మరుసటి రోజు తీరిగ్గా ఎన్టీఆర్ ఇంట్లోనే పురాణాల గురించి, ఆయనకు నచ్చిన విషయాల గురించి మాట్లాడుకున్నామని.. ఆయన ఇక తననెప్పటికీ గుర్తుంచుకునేలా ఆ రెండో సమావేశం జరిగిందన్నారు.
ఆ తర్వాత చాలా సందర్బాల్లో కలుసుకుని చాలా విషయాలపై చర్చించేవాళ్లమని చెప్పిన ఆమె, తర్వాత కాలంలో ఎన్టీఆర్ బయోగ్రఫీ రాయడానికి తాను ఒప్పుకోవడం, నర్సరావుపేట డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్న సమయంలో ప్రతీ వారం వచ్చి ఆయనతో గంటల పాటు గడపడం వల్ల ఇద్దరి మధ్య ఆత్మీయ అనుబంధం ఏర్పడిందని.. ఇలా ఒకరంటే ఒకరం విడిచి ఉండలేని స్థితికి చేరుకున్నాక.. ఎన్టీఆర్ గారే తనను వివాహం చేసుకుంటావా..? అని అడిగినట్టుగా ప్రేమ విషయం గురించి చెప్పారు.
ఇద్దరి మధ్య ఫోన్ కాల్స్ బిల్లు రూ.3.50 లక్షలు :
'అలా తమ ప్రేమ కొనసాగుతున్న రోజుల్లోనే.. ఓరోజు తనతో మాట్లాడడానికైనా ఫోన్ బిల్లు ఎంతో తెలుసా..? అంటూ బిల్ స్లిప్ తన ముందుంచారని.. అక్షరాలా మూడున్నర లక్షల రూపాయల బిల్లు అందులో కనిపించడంతో షాక్ తిన్నానని' చెప్పుకొచ్చారు.
ఇక ఫోన్ బిల్లుపై వివరణ ఇస్తూ.. ఇద్దరం గంటల కొద్దీ ఫోన్ లో మాట్లాడుకునేవాళ్లమని, ఫోన్ లేకుండా రోజు గడవడం చాలా కష్టంగా ఉండేదని చెప్పుకొచ్చారు లక్ష్మీ పార్వతి. ఆ క్రమంలో తనకు ఒక కొడుకు ఉన్న విషయాన్ని.. కుటుంబ సమస్యలను ఎన్టీఆర్ తో పంచుకోవడం, తనను పూర్తిగా అర్థం చేసుకున్న ఎన్టీఆర్ తనకు అన్ని విధాలా సహాయం చేయడం జరిగాయని వివరించారు.
1992లోనే ఎన్టీఆర్ కి తనతో రహస్య వివాహం జరిగినా..! తనకు చాలా ఆటంకాలు ఎదురయ్యాయని.. ఎన్టీఆర్ కుటుంబం తనను ఎన్టీఆర్ నుంచి దూరం చేయడానికి ఆఖరికి కిడ్నాప్ కూడా చేయించారని.. చివరికి తిరుపతిలో జరిగిన మోహన్ బాబు సినిమా ఫంక్షన్ లో ఎన్టీర్ తనను తన భార్యగా అందరిముందు ప్రకటించడంతో ఎవరికి భయపడాల్సిన అవసరం లేకుండా పోయిందన్నారు. ఎన్టీఆర్ తో కలిసుండడమే పెద్ద హనీమూన్ అంటూ అప్పటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.