పొంచి ఉన్న తీవ్ర తుఫాను - ఉత్తరాంధ్ర పై ప్రభావం : కుంభవృష్టి -గాలుల తీవ్రత..!!
భారీ వర్షాలు..వరదలతో రాయలసీమలోని మూడు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. ఆ కష్టం నుంచి ఇంకా తేరుకోకముందే మరో సారి తుఫాను ముంచుకొస్తోంది. ఈ సారి ఉత్తరాంధ్ర వైపు ఈ తుఫాను దూసుకొస్తోంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి గురువారం (ఈ రోజు ) వాయుగుండంగా మారి ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. ఆ తర్వాత 24 గంటల్లోనే(శుక్రవారానికి) తుఫాన్గా బలపడి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది.

ఉత్తరాంధ్ర తీరం దిశగా
అక్కడ నుంచి మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారే క్రమంలో వాయవ్యంగా పయనించి నాలుగో తేదీ ఉదయానికి ఉత్తరాంధ్ర తీరం దిశగా రానుందని భారత వాతావరణశాఖ(ఐఎండీ) తెలిపింది. ఇది ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాపైఎక్కువ ప్రభావం చూపుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మూడో తేదీ నుంచి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, దక్షిణ ఒడిశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.

భారీ వర్షాల హెచ్చరిక
నాలుగో తేదీ తెల్లవారుజాము నుంచి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాల్లో అసాధారణ వర్షాలు, తూర్పు గోదావరిలో అతిభారీ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాల్లో 3వ తేదీ ఉదయం నుంచి గాలుల తీవ్రత పెరుగుతుంది. వీస్తాయి. తీవ్ర తుఫాన్ తీరం దిశగా వచ్చే సమయంలో(నాలుగో తేదీ తెల్లవారుజాము నుంచి) గంటకు 80 నుంచి 90 కి.మీ., అప్పుడప్పుడు 100 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. 3, 4 తేదీల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని సూచించింది.

కుంభవృష్టి .. గాలుల తీవ్రత
తీవ్ర తుఫాను ఉత్తరాంధ్ర తీరం దిశగా రానున్న నేపథ్యంలో మూడో తేదీ అర్ధరాత్రి నుంచి కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయని, గాలుల తీవ్రత పెరిగే క్రమంలో కమ్యూనికేషన్ వ్యవస్థపై ప్రభావం పడుతుందని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల్లోకి సముద్ర జలాలు చొచ్చుకొచ్చే ప్రమాదం ఉందని, ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. పొలాల్లో ఉన్న వరి కుప్పలను రక్షించుకునేలా రైతులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తీవ్ర తుఫానుతో భారీ నష్టం ఉంటుందని ప్రభుత్వ శాఖలను ఐఎండీ అప్రమత్తం చేసింది.
Recommended Video

తుఫాను దిశ పై ఈ రోజు స్పష్టత
దీంతో ఖరీఫ్లో వేసిన వరి పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు వ్యవసాయ శాఖ అప్రమత్తం చేసింది. ఒకవేళ తీవ్ర తుఫాన్ మధ్య బంగాళాఖాతంలో ఉన్నప్పుడే మరింత బలపడితే మాత్రం...తీరానికి దగ్గరగా రాకముందే దిశ మార్చుకుంటుందని చెబుతున్నారు. తుఫాను దిశ..తీవ్రత పైన ఈ రోజు స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో ఐఎండీ హెచ్చరికలకు అనుగుణంగా అధికార యంత్రాంగం అప్రమత్తం అవుతోంది.












Click it and Unblock the Notifications