బంగాళాఖాతంలో అల్పపీడనం: రెండ్రోజుల్లో తమిళనాడులో వర్షాలు, ఏపీకి ఎఫెక్ట్ ఉండేనా?
వర్షాకాలం ముగిసినప్పటికీ.. మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
అమరావతి: వర్షాకాలం ముగిసినప్పటికీ.. మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హిందూ మహా సముద్రాన్ని ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటం ఇందుకు కారణం. అల్పపీడనంకు అనుబంధంగా మరో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఈ అల్పపీడనం రాగల 24 గంటల్లో మరింత బలపడుతుందని.. ఇది క్రమంగా వాయువ్య దిశగా కదులుతూ జనవరి 31వ తేదీ నాటికి బలపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఫిబ్రవరి 1వ తేదీ నాటికి శ్రీలంక, ఆగ్నేయ బంగాళాఖాతానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
అల్పపీడనం ప్రభావం కారణంగా 31వ తేదీ నుంచి శ్రీలంకతోపాటు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల రెండు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ వ్యాప్తంగా ఈశాన్య, ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయని, కనిష్ట ఉష్ణోగ్రతలు కారణంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పొగమంచు కమ్ముుకుంటుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.