జగన్ మాట నెగ్గుతుందా? కొడాలి నాని మాట నెగ్గుతుందా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి షెడ్యూల్ ప్రకారం 2024లో జరగబోయే ఎన్నికలు అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పార్టీని వరుసగా రెండోసారి అధికారంలోకి తెచ్చేందుకు శక్తివంచన లేకుండా కృష్టిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలతో తరుచుగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.

సీటు విషయంలో ఇవేవీ చూడను!
వచ్చే ఎన్నికలు వైసీపీకి కీలకమని, ఎమ్మెల్యేల పనితీరు బాగుంటేనే అధికారంలోకి రాగలుగుతామని ఆయన స్పష్టం చేస్తున్నారు. పనితీరు బాగోలేని ఎమ్మెల్యేలకు సీటిచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పేశారు. అయితే పనితీరు సరిగాలేని ఎమ్మెల్యేలకు ఆరునెలల సమయమిచ్చారు. అప్పటికీ తాను తెప్పించుకున్న సర్వేలో పనితీరు మెరుగుపడలేదని వస్తే సీటివ్వనని, మీపై తనకు ప్రేమ ఉన్నప్పటికీ సీటు విషయంలో ఇవేవీ చూడనని తేల్చేశారు. చివరకు తనను విమర్శించినా లెక్కచేయనన్నారు.

వారసులకు లేదని చెప్పిన జగన్!
ప్రజాప్రతినిధులతో ఇటీవలే జరిగిన సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని తనకు బదులుగా తన వారసుడు కిట్టు పోటీచేస్తారని చెప్పగా ఆ ప్రతిపాదనను జగన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. వారసులు, గీరసులు ఎవరికీ లేదని, మీతోనే తనకు అటాచ్మెంట్ ఉంటుందని, ఈసారికి కచ్చితంగా అందరూ పోటీచేయాల్సిందేనని స్పష్టం చేశారు. వారసులకు సీట్లిచ్చేది లేదని తేల్చేశారు. అప్పటివరకు వారసులకు సీట్ల విషయంలో ఆశలు పెట్టుకున్నవారంతా తమ తమ నియోజకవర్గాల్లో మళ్లీ 'గడప గడపకు మన ప్రభుత్వం'లో పాల్గొనడం ప్రారంభించారు.

బందరులో కిట్టూనే పర్యటిస్తున్నారు!!
బందరు నియోజకవర్గంలో మాత్రం పేర్ని నానికి బదులుగా కిట్టూనే తిరుగుతున్నారు. ఇటీవలే ఒక కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కొడాలి నాని రానున్న ఎన్నికల్లో బందరు నుంచి కిట్టూ పోటీచేయబోతున్నారంటూ ప్రకటించారు. అయితే నాని ప్రకటన తర్వాత జరిగిన సమావేశంలోనే వారసులకు సీట్లు లేదంటూ జగన్ ప్రకటించారు. సీఎం చెప్పినప్పటికీ బందరులో కిట్టూనే తిరుగుతున్నారు. 'గడప గడపకు మన ప్రభుత్వం'లో వారసుల పర్యటనను పరిగణనలోకి తీసుకోనని, ఎమ్మెల్యేలుగా ఉన్నవారే తిరగాలని జగన్ చెబుతున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా కొడాలి నాని మాట నెగ్గుతుందా? జగన్ మాట నెగ్గుతుందా? అనేదానికి కాలమే సమాధానం చెప్పబోతోంది.












Click it and Unblock the Notifications