జగన్ పార్టీవారిని, టిడిపివారిని తరిమికొట్టండి: యాష్కీ
బోధన్: సమైక్య రాగం ఆలపిస్తున్న వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీవారిని, తెలుగుదేశం పార్టీవారిని తెలంగాణ నుంచి తరిమికొట్టాలని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో కాంగ్రెసు జైత్రయాత్ర సభలో ఆయన శుక్రవారం మాట్లాడారు. వైయస్ జగన్, చంద్రబాబు నాయుడిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. వైయస్ రాజశేఖర రెడ్డికి సోనియా గాంధీ భిక్ష పెట్టిందని, అటువంటి సోనియాను జైలు నుంచి వచ్చి జగన్ ఏకవచనంతో సంబోధిస్తున్నాడని ఆయన అన్నారు.
తండ్రి భౌతిక కాయానికి దహన సంస్కారం కూడా కాక ముందే జగన్ పదవిని ఆశించాడని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు, టిడిపి జెండాలు పట్టుకుంటే ఊళ్ల నుంచి తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు పిచ్చెక్కి మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణకు అనుకూలమని చంద్రబాబు ప్రణబ్ కమిటీకి చెప్పారని, తెరాసతో పొత్తు పెట్టుకున్నారని, ఇప్పుడు యూటర్న్ తీసుకుని దొంగ దీక్ష చేశారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగదని, శాసనసభ ద్వారా తెలంగాణ ఏర్పాటును అడ్డుకుంటామని చెప్పడం అవివేకమని ఆయన అన్నారు. ఓట్ల కోసం సీమాంధ్ర ప్రజలను మభ్యపెడుతున్నారు, భయపెడుతున్నారని ఆయన విమర్శించారు.
సోనియా గాంధీ వల్లనే తెలంగాణ కల సాకారమైందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. తెలంగాణ రాదేమోననే భయం అక్కర్లేదని, దోపిడీని కొనసాగించడానికే సమైక్యవాదమని ప్రభుత్వ విప్ షబ్బీర్ అలీ అన్నారు. తెలంగాణపై నిర్ణయం జరిగిందని, ఎలాంటి భయం అవసరం లేదని, డిసెంబర్లోగా తెలంగాణ ఏర్పడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. భద్రతపై తెలంగాణలోని సీమాంధ్రులు అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని మంత్రి డికె అరుణ అన్నారు. మహిళను గౌరవించే మన దేశంలో సోనియాను అవమానిస్తున్నారని ఆమె తప్పున పట్టారు.
తెలంగాణ రావడం ఖాయమని పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. సోనియా గాంధీ కారణంగానే ఈనాడు అధికారంలో ఉన్నారని, వారు ఎందుకు ధిక్కారం ప్రదర్శిస్తున్నారో అర్థం కావడం లేదని ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా అన్నారు. తెలంగాణను ఎవరూ అడ్డుకోలేరని, సీమాంధ్రను ఆదుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డం రావద్దని, మీకు ఏం కావాలో కేంద్రాన్ని అడిగి తెలుసుకోవాలని ఆయన సీమాంధ్రులకు సూచించారు. హైదరాబాదులోని ఉత్తర భారతీయులకు లేని భయం సీమాంధ్రులకు ఎందుకని ఆయన అడిగారు.