జగన్ వ్యాఖ్యలు తిప్పికొట్టేందుకేనా?: ఒంగోలు నుంచి కడపకు మారిన 'మహా సంకల్పం'
అమరావతి: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని చెప్పుతో కొట్టాలంటూ వైసీపీ అధినేత వైయస్ జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు మంత్రివర్గంలోని మంత్రులతో సహా, చోటా మొటా నేతలు సైతం ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి హోదాలోని వ్యక్తిని చెప్పులతో కొట్టాలంటారా? అంటూ జగన్పై టీడీపీ మంత్రులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైయస్ జగన్ వ్యాఖ్యలు, ఏపీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకునేందుకు కూడా కారణమయ్యాయి.
జూన్ 2ను పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన నవ నిర్మాణ దీక్షల ముగింపు కార్యక్రమాన్ని ఈనెల 8వ తేదీన ప్రకాశం జిల్లా ఒంగోలులో 'మహా సంకల్పం' పేరిట భారీ సభను నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా వైయస్ జగన్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ 'మహా సంకల్పం' సభను జగన్ సొంత జిల్లా కపడపు మార్చారు. ఈ మేరకు శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రభుత్వం 'మహా సంకల్పం' వేదికను మారుస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
ఇటీవల కాలంలో ఏపీ రాజధానికి సంబంధించిన ఏ కార్యక్రమమైనా విజయవాడ, దాని పరిసర ప్రాంతాల్లోనే జరుగుతుండటంతో రాయలసీమ ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయన్న భావనతోనే ఒంగోలు నుంచి 'మహా సంకల్పం' వేదికను కడపకు మార్చామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
అయితే వాస్తవానికి వైయస్ జగన్ వ్యాఖ్యల నేపథ్యంలోనే 'మహా సంకల్పం' వేదికను కడపకు మార్చారని సమాచారం. జగన్ చేసిన వ్యాఖ్యలు తప్పని, కడప జిల్లా ప్రజల ముందే జగన్ వ్యాఖ్యలను తిప్పి కొట్టడంతో పాటు ఏపీ అభివృద్ధి కోసం తాను ఎంతో కష్టపడుతుంటే జగన్ తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉందని చెప్పుకోవాలన్న భావనతోనే టీడీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications