వెళ్లాలో, వద్దో తెలియదు: రాజకీయాలపై హీరో మహేష్ బాబు మాట అదే
రాజకీయాల గురించి ప్రిన్స్ మహేష్ బాబు మళ్లీ అదే మాట అన్నారు. రాజకీయాల్లోకి వెళ్లాలో వద్దో కూడా తెలియదని ఆయన అన్నారు.
హైదరాబాద్: రాజకీయాల గురించి తెలుగు సినిమా హీరో మహేష్ బాబు మళ్లీ అదే మాట అన్నారు. రాజకీయాల గురించి తనకు అసలేమీ తెలియదని ఆయన అన్నారు. రాజకీయాల్లోకి వెళ్లాలో, వద్దో కూడా తెలియదని అన్నారు. తన దృష్టి అంతా సినిమా మీదే ఉందని చెప్పారు.
మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గతంలో రాజకీయాల్లోకి ప్రవేశించి వెనక్కి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన బావ గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. ఆయన అంకుల్ ఆదిశేషగిరి రావు కూడా రాజకీయాల్లో ఉన్నారు. కానీ మహేష్ బాబు రాజకీయాల పట్ల ఆసక్తి లేదని చెబుతున్నారు.
కాగా, 'స్పైడర్' సినిమాతో తమిళనాడులోనూ అడుగుపెడుతున్నారు. మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తెలుగుతోపాటు తమిళంలోనూ భారీగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఓ తమిళ పత్రికకు మహేష్ బాబు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో తన స్నేహితుల గురించి మాత్రమే కాకుండా రాజకీయాల గురించి మాట్లాడారు.
తెలుగు సినీ పరిశ్రమలో తనకు చిరంజీవి, రామ్చరణ్ చాలా సన్నిహితులని చెప్పారు. వారితో తనకు మంచి సంబంధాలున్నాయని అన్నారు. కోలీవుడ్లో విజయ్ తనకు మంచి మిత్రుడని, విజయ్, తానూ కలిసి మణిరత్నం సినిమాలో నటిద్దామని అనుకున్నామని, కానీ అది కుదరలేదని చెప్పారు.
సూర్య, కార్తీ, యువన్శంకర్ రాజా తన స్కూల్మేట్స్ అని చెప్పారు. తాను చెన్నైలోనే 25 ఏళ్లు పెరిగినట్లు తెలిపారు. ఇక్కడే చదువుకున్నానని అన్నారు. వేసవి సెలవుల్లో సినిమాలు చేసేవాడినని అన్నారు. తెలుగు, తమిళం చాలా బాగా మాట్లాడగలను గానీ చదవడం మాత్రం చాలా కష్టమని మహేష్ బాబు చెప్పారు.