వెర్రి ఫ్యాన్స్, గాలి పార్టీ, ప్రజారాజ్యం లాగే...: పవన్ కల్యాణ్పై మరో 'కత్తి'
హైదరాబాద్: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అభిమానులపై సినీ క్రిటిక్ మహేష్ కత్తి మరోసారి విరుచుకుపడ్డారు. వారికి ఆయన సలహా కూడా ఇచ్చారు. జనసేనను గాలి పార్టీగా అభివర్ణించారు.
Recommended Video
ఆ మేరకు ఆయన తన వ్యాఖ్యలను ఫేస్బుక్లో పోస్టు చేశారు. మిగతా పార్టీల నాయకులకు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్కు ఉన్న తేడా గురించి తనదైన శైలిలో వివరించారు. రాజకీయాల్లో కనాసాగాలనుకునేవారికి సహనం, సంయమనం అవసరమని ఆయన సలహా ఇచ్చారు.
అటువంటి వారే రాజకీయాల్లో అడుగు పెట్టాలి...
దూషణ భూషణ తిరస్కారాలను ఆశీస్సులుగా స్వీకరించగలిగే వారే రాజకీయాలలో అడుగుపెట్టాలని, ప్రజలందరూ ఒకేవిధంగా ఉండరని, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చుతారని, ఇపుడు రాజకీయాభిమానాలు సిద్ధాంతప్రతిపాదికగా ఏర్పడటం లేదని మహేష్ కత్తి అన్నారు. వ్యక్తిగత అభిమానం, వారసత్వం, గ్లామర్, కులం, మతం, ప్రాంతం అనే షడ్వర్గాలు నేటి రాజకీయ నాయకులకు ఊపిరి పోస్తున్నాయని అభిప్రాయపడ్డారు. తమవాడిని స్తుతించడం, ఎదిరివాడిని దూషించడం సమాజంలో పెద్ద జాడ్యంగా మారిపోయిందని, కాబట్టి అన్నివర్గాల ప్రజల మనోభావాలను గౌరవించగలిగే వాడే నేడు రాజకీయాల్లో నిలదొక్కుకోగలడని ఆయన పరోక్షంగా పవన్ కల్యాణ్ను ఉద్దేశించి అన్నారు.
వారిని అలా తిడుతుంటాం
నిద్రలేచినప్పటినుంచి మనం చంద్రబాబును, జగన్ ను, కేసీయార్ ను, మోడీని, సోనియాను, రాహుల్ను ఇష్టం వచ్చినట్లు తిడుతుంటాము. విమర్శిస్తుంటామని, మనకు తెలిసినా, తెలియకపోయినా, మనం అభిమానించేవారిని విమర్శించినా, ప్రతిదూషణలు చేస్తుంటామని మహేష్ కత్తి అన్నారు. కానీ, పైన చెప్పబడిన నాయకులు కానీ, పార్టీలు కానీ, అలా విమర్శించిన వారిని తిరిగి విమర్శించడం, వారిపై దాడులు చెయ్యడం, వారిని వ్యక్తిగతంగా పరుషపదజాలంతో తిట్టడం చెయ్యగా మనం చూడలేదని అన్నారు.
చంద్రబాబు, జగన్లపై ఇలా...
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చంద్రబాబు రెండు లక్షలకోట్ల దోచాడని, జగన్ లక్ష కోట్లు దోచాడని, వెన్నుపోటుదారుడు అని, దొంగ అని, ఖూనీకోరు అని... ఇలా ఒకటేమిటి... అనేకరకాలుగా అభ్యంతరకరమైన నిందలు వేస్తుంటారని మహేష్ కత్తి అన్నారు. అయినప్పటికీ చంద్రబాబు కానీ, జగన్ కానీ, వారి అనుచరులు కానీ, అలా విమర్శించినవారిని మళ్ళీ ఎదురుతిట్టడం, భౌతిక దాడులు చెయ్యడం ఎక్కడా జరగలేదని అన్నారు. తమమీద వచ్చే విమర్శలను మౌనంగా భరిస్తుంటారని, అందుకే ఆ నాయకులు దశాబ్దాల తరబడి రాజకీయాల్లో నిలబడగలిగారని అన్నారు.
కానీ జనసేనలో అలాంటి లక్షణాలు..
కానీ, జనసేన అనే పార్టీకి అలాంటి లక్షణం కనిపించడం లేదని మహేష్ కత్తి అన్నారు. పవన్ను విమర్శించినవారిని బూతుపదాలతో విమర్శిస్తున్నారని, బెదిరిస్తున్నారని అన్నారు. కొండొకొచో భౌతికదాడులకు పాల్పడుతున్నారని, ఇలాంటి వారిని పవన్ కూడా వారించలేకపోవడం విచిత్రమని అన్నారు. రాజకీయాల్లో రౌడీతనం చెల్లదని, విమర్శలకు ఎవ్వరూ భయపడరని, విమర్శకులు తలచుకుంటే ఇంకా భయంకరంగా చీల్చి చెండాడుతారని అన్నారు.
వెర్రి అభిమానులు తేల్చేస్తున్నారు...
జనసేనకు రాజకీయాల్లో కొనసాగే లక్షణం లేదు అని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదని అన్నారు. జనసేన అనేది ఒక గాలిపార్టీ అని ఇలాంటి వెర్రి అభిమానులు రుజువు చేస్తున్నారని మహేష్ కత్తి అభిప్రాయపడ్డారు. 2019 తరువాత జనసేన కూడా ప్రజారాజ్యం లాగానే అదృశ్యం అవుతుందని అన్నారు. ఇకనైనా పవన్ అభిమానులు తమ బుద్ధులు మార్చుకోవడం మంచిది. లేకపోతె ప్రజలు చిరంజీవికి పట్టించిన గతే పవన్ కు కూడా పట్టిస్తారని వారు తెలుసుకోవాలని అన్నారు.