అలాంటి ఆవిష్కరణలు చేయాలి: ఫిన్టెక్ ప్రారంభోత్సవంలో సిఎం చంద్రబాబు పిలుపు
విశాఖపట్నం:ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సమాజ హితానికి, దేశ అభివృద్ధికి ఉపకరించే ఆవిష్కరణలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో జరుగుతున్న ఫిన్టెక్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి మాట్లాడుతూ అడ్వాన్స్ డ్ టెక్నాలజీని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత యాంత్రిక వ్యవస్థను అమలు చేస్తోందని చెప్పారు. ముఖ్యంగా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి, వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడే అతి ముఖ్యమైన అంశాలపై తాము దృష్టి సారించడం జరిగిందన్నారు.
ఆర్టీజిఎస్ తో...మెరుగైన ఫలితాలు
విశాఖపట్నంలో జరుగుతున్న వైజాగ్ ఫిన్టెక్ ఫెస్టివల్ 2018 ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ నదీ జలాలు, భూగర్భ జలాలు, భూసారం, పర్యావరణం, విద్యుత్, రవాణా, నైపుణ్యం కలిగిన మానవ వనరులు మొదలైన అంశాలను ఈ-ప్రగతి ద్వారా అనుసంధానించి అవసరమైన విజ్ఞానాన్ని అందిస్తున్నామని తెలిపారు. అలాగే రియల్ టైం గవర్నెన్స్ లో సమయం, ఖచ్చితత్వాలను పాటించి మరింత మెరుగైన ఫలితాలను సాధిస్తామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర జిడిపి ప్రస్తుతం 10.3శాతం ఉండగా...దాన్ని 15శాతం వరకు పెంచితేనే తృప్తి ఉంటుందన్నారు.
అభివృద్ది...అవార్డులు
జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించిన గ్రామాల జాబితాల్లో ఆంధ్రప్రదేశ్ 55శాతం అవార్డులు గెలుచుకున్నట్లు సిఎం వెల్లడించారు. సహజ వనరులను గుర్తించి, విజ్ఞానాన్ని వినియోగించి తద్వారా అభివృద్ధి సాధించడంలోనే నాయకత్వ పటిమ తెలుస్తుందని సిఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఇన్నోవేషన్ వ్యాలీగా అభివృద్ధి చేయాలని సంకల్పించామన్నారు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా దానికి అవసరమైన సహాయాన్ని అందిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని...వారికి అవసరమైన పూర్తి సహకారాన్ని తమ ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు.
ఐటి అనుసంధానం:లోకేష్
అనంతరం ఇదే కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఐటి, పంచాయతీరాజ్ శాఖా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఎపిలో ఐటీ రంగాన్ని పారిశ్రామిక, విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. మౌలిక సదుపాయాలను అందించడం, వాతావరణ పరిస్థితులను తెలియపరచడం ద్వారా గత సంవత్సరం రాష్ట్రంలో 18శాతం వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పటికీ 24 శాతం వ్యవసాయాభివృద్ధి సాధించగలిగామని మంత్రి లోకేష్ తెలిపారు.
డ్రోన్లు...సౌరవిద్యుత్
ఈ సంవత్సరం 24శాతం వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటూ కూడా 16శాతం అభివృద్ధి సాధిస్తున్నామని లోకేష్ చెప్పారు. అలాగే రహదారుల నిర్మాణం నాణ్యతలో డ్రోన్లు వినియోగిస్తున్నామని, సౌర విద్యుత్ను అభివృద్ధి చేస్తున్నామని లోకేష్ వివరించారు. అనంతరం ఔత్సాహిక యువ పారిశ్రామిక వేత్తలు అడిగిన సందేహాలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.