రోల్కాల్ చేస్తుంటే కాల్చి చంపారు: వరవరరావు, రాజ్నాథ్ ఆరా
విశాఖపట్నం: ఏవోబీలో జరిగింది బూటకపు ఎన్కౌంటరేనని విరసం నేత వరవరరావు ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలపై ధ్వజమెత్తారు. వేకువజామునే మావోయిస్టులు రోల్కాల్ చేస్తుండగా గ్రేహౌండ్స్ పోలీసులు పట్టుకొని కాల్చి చంపారని ఆరోపించారు. దీనికి ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకుంటాయన్నారు.
ఆయన మంగళవారం రాత్రి సుమారు 11.45 గంటల సమయంలో మల్కన్గిరిలోని ఎస్పీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. చనిపోయిన వారిలో 14 మంది పేర్ల జాబితాను ఆయన ప్రకటించారు. మిగిలిన వారంతా మిలీషియా సభ్యులు, గ్రామస్థులు అయి ఉంటారని భావిస్తున్నామని వరవరరావు తెలిపారు.
అందరూ భావిస్తున్నట్టుగా కేంద్ర కమిటీ సభ్యులు గాజర్ల రవి, చలపతి ఈ సంఘటనలో మృతి చెందలేదని ఆయన స్పష్టం చేశారు. బుధవారం ఉదయం పోలీసుల స్వాధీనంలో ఉన్న మృతదేహాలను గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగిస్తామన్నారు. ఆయన విశాఖ నుంచి జయపురం మీదుగా మృతుల కుటుంబికులతో కలిసి మల్కన్గిరి ఎస్పీ కార్యాలయానికి చేరుకొని రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.
మావోయిస్టు పికెఎం. ప్రభాకర్ భార్య దేవేంద్ర మాట్లాడుతూ.. తన భర్తను పోలీసులు హతమార్చి ఆ విషయాన్ని బహిరంగపరచకుండా దాచిపెడుతున్నారన్నారు. ఇది తెలంగాణలో ప్రభావం చూపుతుందని భావించి కావాలనే బహిరంగపరచడం లేదని అన్నారు.

వరవరరావు ప్రకటించిన మృతులు వివరాలు
1. పికెఎం ప్రభాకర్ అలియాస్ గంగాధర్(కంటోన్మెంట్, రంగారెడ్డి జిల్లా)
2. ప్రసాద్ అలియాస్ వెంకటరమణ అలియాస్ గణేష్(విశాఖ)
3. కిరణ్, డివిజన్ కమిటీ సభ్యుడు(పశ్చిమగోదావరి)
4. పృధ్వీ అలియాస్ మున్నా, ఆర్కే తనయుడు(ఒంగోలు)
5. లత అలియాస్ భారతి ఏరియా కమిటీ సభ్యురాలు దుబాశి శంకర్(రాష్ట్ర కమిటీ సభ్యుడు) భార్య(మెదక్)
6. మధు అలియాస్ దావీద్ ఏరియా కమిటీ సభ్యుడు(పశ్చిమగోదావరి)
7. రాజీవ్, ఏరియాకమిటీ సభ్యుడు (పశ్చిమ బస్తర్)
8. బుద్రీ, ఏరియా కమిటీ సభ్యుడు (పశ్చిమ బస్తర్)
9. మమత, ఏరియా కమిటీ సభ్యురాలు(శ్రీకాకుళం)
10. కమల, పార్టీ సభ్యురాలు (దక్షిణ బస్తర్)
11. ఎర్రాల, ఏరియా కమిటీ సభ్యురాలు (దక్షిణ బస్తర్)
12. మంజుల, ఏరియా కమిటీ సభ్యురాలు (మరింగేర్)
13. హరి అలియాస్ సింహాచలం జిల్లా కార్యదర్శి, విజయనగరం
14. రమేష్ బాగాలు, జిల్లా కమిటీ సభ్యుడు మర్రిగడ్డ
రాజ్నాథ్ ఆరా
ఆంధ్రా, ఒడిశా సరిహద్దు(ఏఓబీ)లో జరిగిన భారీ ఎన్కౌంటర్పై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ స్పందించారు. ఈ కాల్పుల్లో పోలీసుల చేతితో 24మంది మావోయిస్టులు హతమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బహ్రెయిన్లో ఉన్న రాజ్నాథ్ అక్కడి నుంచే ఎన్కౌంటర్పై ఆరా తీశారు.
ఎన్కౌంటర్పై ఎప్పటికప్పుడు అధికారులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో రాజ్నాథ్సింగ్ ఫోన్లో మాట్లాడారు. ఆ రాష్ట్రంలో మావోయిస్టుల అణిచివేతకు తాము సాయం అందిస్తామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications