వారికి క్షమాపణలు చెబుతున్నా: మల్లాది వాసు, ఆ సంస్కృతి మాది కాదంటూ వివరణ
ఖమ్మం: కులంలో చీడపురుగుల్లా తయారైన ఏపీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలను భౌతికంగా లేకుండా చెయ్యాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ టీఆర్ఎస్ కౌన్సిలర్ మల్లాది వాసు.. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. అంతేగాక, ఎందుకోసం చేయాల్సి వచ్చిందో చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యల పట్ల వారికి క్షమాపణలు తెలిపారు.
అందుకే ఆ వ్యాఖ్యలంటూ మల్లాది వాసు క్షమాపణ
తాను వ్యక్తిగతంగా ఎవర్నీ ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని మల్లాది వాసు చెప్పారు. ఎన్టీ రామారావు కుటుంబం మీద ఉన్న అభిమానం, కమ్మ కులానికి జరుగుతోన్న అన్యాయం చూసి బాధపడి వ్యాఖ్యలు చేశానని తెలిపారు. తనకు ఏ రకమైన నేర సంస్కృతి లేదని.. హత్యలు చేయించే సంస్కృతి తనది కాదని వ్యాఖ్యానించారు. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు చూసి బాధతో మాట్లాడినట్లు పేర్కొన్నారు.
ఆడవాళ్లపై కామెంట్ చేయడం సరికాదన్న వాసు
కొంతమంది కావాలని తన వీడియోని వక్రీకరించారని చెప్పుకొచ్చారు మల్లాది వాసు. తనకు ఎవరి మీద కక్షలు లేవని.. స్కెచ్ వేయటం.. అందుకోసం డబ్బులు ఖర్చు చేయటం లాంటి ఉద్దేశాలు లేవన్నారు. కమ్మ కమ్యూనిటీ, వెల్ఫేర్, సంక్షేమం కోసం ఖర్చు పెడతానని ఆయన వివరించారు. తాను మాట్లాడిన మాటలు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరారు. అంతేగాక, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని స్పష్టం చేశారు. కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళ మీద కామెంట్ చేయడం కరెక్ట్ కాదని హితవు పలికారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాలను భౌతికంగా తొలగించాలంటూ ఓ కార్యక్రమంలో వాసు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాసు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు చెప్పారు.
అక్కా అని పిలిచేవాడ్ని..: భువనేశ్వరికి వల్లభనేని వంశీ క్షమాపణ
కాగా, నారా భువనేశ్వరికి వల్లభనేని వంశీ క్షమాపణలు చెప్పారు. అనుకోకుండా తప్పుగా మాట్లాడానని, భువనేశ్వరి అంటే తనకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు. తాను అక్కా అని ఆమెను పిలిచేవాడినని, ఆమె కూడా తనను ఎంతో ప్రేమగా బాబూ అంటూ పలకరించేదని వల్లభనేని వంశీ వెల్లడించారు. తన తప్పు తెలుసుకుని తాను ఆమెకు క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. నారా లోకేష్, చంద్రబాబు వైఖరి వల్లే తాము టీడీపీకి దూరం కావాల్సి వచ్చిందన్నారు. మల్లాది వాసు వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఇదంతా చంద్రబాబు వెనకుండి నడిపిస్తున్నదేనని అన్నారు. చంద్రబాబే కమ్మ కులంలో పుట్టిన చీడపురుగు అని విమర్శించారు. ఎంతో సేవ చేస్తున్న కులానికి చెడ్డ పేరు తెస్తున్నారని మండిపడ్డారు.
క్షమాపణలకు ఇంత సమయమా అంటూ వంగలపూడి అనిత
ఇది ఇలావుండగా, వల్లభనేని వంశీ క్షమాపణలు చెప్పడంపై టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్పందించారు. క్షమాపణలు చెప్పేందుకు ఇంత సమయం కావాలా? అని ప్రశ్నించారు. తాము క్షమాపణ అని అనుకోవడం లేదని, 95 శాతం చంద్రబాబు క్షమాపణ చెప్పాలని కొడాలి నాని అంటున్నారని తెలిపారు. ఎలాంటి క్షమాపణ అనేది ఆలోచించుకోవాలని వల్లభనేని వంశీకి సూచించారు అనిత. మంత్రి కొడాలి నాని ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అమరావతి పాదయాత్రలో రైతులను అనేక ఇబ్బందులు పెడుతున్నారని, వంట, భోజనం చేయకుండా అడ్డుకున్నారని అనిత విమర్శించారు. దీంతో ఆందోళన చేపడుతున్నవారు... నడిరోడ్డుపై కూర్చొని భోజనం చేశారన్నారు. మహిళలకు బయో టాయిలెట్స్ లేకుండా తొలగించారని, పొదుపు సంఘాల్లో దాచుకున్న డబ్బులను తీసుకోవడానికి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఓటీఎస్ కొంద కొత్తగా రిజిస్ట్రేషన్ చేయడం ఏంటీ ? అని ఆమె ప్రశ్నించారు. దిశ చట్టం కింద నలుగురికి ఉరి శిక్ష వేశామని హోం మంత్రి అమాయకంగా చెబుతున్నారని వంగలపూడి అనిత విమర్శించారు.