అనుమానంతో తమ్ముడినే హత్య చేశాడు
కర్నూలు: వివాహేతర సంబంధంతో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా కోడుమూరులో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కోడూమూరు ఎస్సీకాలనీకి చెందిన మద్దిలేటి, నాగులు(30) అన్నదమ్ములు.
అయితే మద్దిలేటి భార్యకు, తన తమ్ముడు నాగులుకు మధ్య వివాహేతర సంబంధం ఉందని మద్దిలేటికి అనుమానం. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం తన భార్య, తమ్ముడు సన్నిహితంగా ఉండటం చూసి ఆగ్రహంతో మద్దిలేటి కత్తితో నాగులుపై దాడి చేశాడు.
దీంతో నాగులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
యువకుడి దారుణ హత్య
కడప జిల్లాలో నందలూరు మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడిని దారుణంగా హత్య చేసి పీలేరు నదిలో పూడ్చారు. ఈ విషయం శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. నందలూరు మండలంలోని ఆడాపూర్కు చెందిన బాలాజీ (26) మూడు రోజులుగా కనిపించడం లేదు.
బాలాజీ ఆచూకీ తెలుసుకోవాలని అతడి కుటుంబ సభ్యులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే శుక్రవారం ఉదయం గ్రామ సమీపంలోని పీలేరు నదిలో బాలాజీ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.
'రెండ్రోజుల క్రితమే హత్య చేసి నదిలో పూడ్చారు. అయితే దుండగులు మృతదేహాన్ని సరిగా ఖననం చేయకపోవడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది. దుండగుల కోసం గాలింపు చేపట్టాం' అని పోలీసులు తెలిపారు.