బాబు క్యాంప్ ఆఫీస్లో వ్యక్తి సూసైడ్యత్నం(ఫొటో)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్యాంపు ఆఫీసులో శుక్రవారం సాయంత్రం చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అతడ్ని చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన గంగులప్ప (42) గుర్తించారు.
అతడు జడెల చెక్క భజన చేస్తుంటాడు. ఆ వృత్తికి ఆదరణ తగ్గటంతో సంపాదనలేక కుటుంబ పోషణ భారం కావడంతో అప్పులపాలయ్యాడు. దీనికి తోడు ఊరిలో ఉన్న భూమికి సంబంధించి దస్తావేజులు సైతం సరిగ్గాలేవు. తన పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెప్పుకునేందుకు రాజ్భవన్ రోడ్డులో సిఎం క్యాంపు కార్యాలయానికి శుక్రవారం ఉదయం వచ్చాడు.
గంగులప్పను అధికారులు సాయంత్రం సోదా చేసి లోనికి అనుమతించారు. తనతో పాటు అప్పటికే కూల్డ్రింక్లో విషాన్ని కలుపుకుని తెచ్చుకున్న గంగులప్ప లోపలికి వెళ్ళాక తాగాడు. కొద్దిసేపటికే అస్వస్థతకు గురైన అతడిని సెక్యూరిటీ అధికారులు గమనించి చికిత్స నిమిత్తం నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
నిమ్స్ అత్యవసర విభాగంలో చికిత్స అందించిన వైద్యులు ప్రస్తుతం గంగులప్ప ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. గంగులప్ప వద్ద హరివేణి గంగా భవాని హ్యాండ్వర్క్స్ డెవలప్మెంట్ సొసైటీ, కళాకారుల సంఘం సభ్యుడిగా గుర్తింపు కార్డు ఉంది. తనకు అప్పులు ఎక్కువయ్యాయని, భూమి పట్టా కోసం వచ్చానని విచారణ కోసం వచ్చిన అధికారులతో గంగులప్ప చెప్పాడు. గంగులప్ప తెలుగుదేశం పార్టీ కార్యకర్త, అతనికి నలుగురు కూతుళ్లు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న గంగులప్ప ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నాడు.