బాబు లేదా జగన్ ఆదుకోండి: ఏపీకి హోదా కోసం ఆత్మహత్యాయత్నం
విజయవాడ: ప్రత్యేక హోదా కోసం సుబ్బారావు అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. కృష్ణాజిల్లా పామర్రులోని సాయినగర్కు చెందిన చావలి సుబ్బారావు (35) శనివారం ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఇంట్లో ఉరి వేసుకోవడాన్ని చూసిన ఆయన తల్లి చూసి కేకలు వేయడంతో తండ్రితో పాటు ఇరుగుపొరుగు వచ్చి సుబ్బారావును కిందకు దించి, ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషయంగా ఉండటంతో 108లో విజయవాడ వైద్యశాలకు తరలించారు.
ఆత్మహత్యాయత్నానికి ముందు సూసైడ్ నోట్ రాసిపెట్టాడు. తాను పద్దెనిమిది సార్లు వివిధ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు వెళ్లినా ఎలాంటి ప్రయోజనం కలగలేదని, ఇక జన్మలో ఉద్యోగం రాదని రాశాడని, ఇప్పటి వరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడం బాధించిందని, ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాణత్యాగమే సరైన నిర్ణయంగా భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.
ప్రభుత్వాలు మారినా కనీసం ఆటో కోసం రుణం కూడా తీసుకోలేకపోయానని. భార్య పిల్లలకు అన్నం పెట్టలేకపోతున్నానని, తాను ఈ సమాజానికి అపాయకారిగా మారేకన్నా ఇదే గౌరవమైన పని అనుకుంటున్నానని, వీలైతే ఏపీ సీఎం చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ తన కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు.
రాష్ట్రానికి హోదా కోరుతూ ఆత్మహత్యాయత్నం చేసిన సుబ్బారావును ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం రాత్రి పరామర్శించారు. పెనమలూరు మండలం పోరంకిలోని ప్రయివేటు ఆసుపత్రికి చేరుకొని సుబ్బారావు ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా కోసం తాను అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు మనోధైర్యంతో ఉండాలన్నారు.