ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ విశాఖ జిల్లాలో మరో ఆత్మహత్యా యత్నం
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ మరో వ్యక్తి శుక్రవారం మధ్యాహ్నాం ఆత్మహత్యా యత్నం చేశాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నం జిల్లాలోని దేవరాపల్లిలో దేవుడి నాయుడు అనే వ్యక్తి ప్రత్యేక హోదా కోరుతూ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.
అయితే దేవుడి నాయుడు ఆత్మహత్యా యత్నాన్ని చూసిన స్థానికులు వెంటనే అతడిని పట్టుకుని, అఘాయిత్యం జరగకుండా చూశారు. సమాచారం అందుకున్న పోలీసులు దేవుడినాయుడిని అదుపులోకి తీసుకుని, కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ అత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది.
గుడివాడలో వ్యక్తి ఆత్మహత్య
ఏపీకి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని మనస్తాపం చెంది కృష్ణాజిల్లా గుడివాడ శ్రీరామపురం కాలనీకి చెందిన ఉదయభాను(40) గురువారం అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రత్యేక హోదా ఇవ్వలేదనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. ఘటనాస్థలంలో లభ్యమైన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఏపీకి ప్రత్యేకహోదా రాదని గూడూరులో గుండెపోటుతో వ్యక్తి మృతి
ఏపీకి ప్రత్యేక హోదా రాదనే మనస్తాపంతో ఓ వ్యక్తి గుండెపోటుతో చనిపోయిన ఘటన నెల్లూరు జిల్లాలోని గూడూరులో చోటు చేసుకుంది. గూడూరుకు చెందిన గనుమాని లోకేశ్వరరావు(32) ఎమ్మిగనూరులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో కాంట్రాక్టు లెక్చరర్గా పని చేస్తున్నాడు.
గురువారం రాత్రి గూడూరుకు వచ్చిన లోకేశ్వరరావు రాష్ట్రానికే ప్రత్యేక హోదా ప్రకటిస్తే, ఉద్యోవకాశాలు మెరుగవుతాయని, తనలాంటి వారికి ఉపాధి లభిస్తుందని కుటుంబ సభ్యులకు చెప్పాడు. ఆ తర్వాత కొద్ది సేపటి తర్వాత అతడు తీవ్ర గుండెపోటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోగానే మృతి చెందాడు.