విభజనతో ఉద్యోగం పోయింది, ప్రత్యేక హోదా కోసం వ్యక్తి ఆత్మహత్య
నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వేదాయపాలెంలో ప్రత్యేక హోదా కోసం మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. విభజన నేపథ్యంలో ఔట్ సోర్సింగులో పని చేసే అతని ఉద్యోగం పోయింది, ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా కావాలని సూసైడ్ నోట్ రాసి అతను అత్మహత్య చేసుకున్నాడు.
వేదాయపాలెంకు చెందిన లక్ష్మయ్య హౌసింగ్ బోర్డులో ఔట్ సోర్సింగులో ఉద్యోగం చేసేవాడు. విభజన అనంతరం ఆయన ఉద్యోగం పోయింది. ఆయన వయస్సు 53 వరకు ఉంటుంది. ఈ వయస్సులో తనకు మరోచోట ఉద్యోగం రాదని అథను కలత చెందాడు.

ఏపీకి ప్రత్యేక హోదా వస్తేనే అందరికీ ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ఆయన భావించారు. ఈ నేపథ్యంలో ఆయన హోదా కోరుతూ ఆత్మహత్య చేసుకున్నారు. నాలాంటి వారు చాలామంది ఉన్నారని ఆయన నోట్లో పేర్కొన్నారు.
జై ప్రత్యేక హోదా, జైజై ప్రత్యేక హోదా అని అందులో పేర్కొన్నారు. నిరుద్యోగ సమస్య తీరాలని కూడా రాశారు. కాగా, లక్ష్మయ్య తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని కూడా తెలుస్తోంది.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హోదా విషయమై మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినప్పటికీ... అంతకుమించి ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పింది.

ఈ నేపథ్యంలో విపక్షాలతో పాటు ప్రజా సంఘాలు ధ్వజమెత్తాయి. ఆందోళనలకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికలను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.












Click it and Unblock the Notifications