విషాదం: పవన్ కళ్యాణ్ కాకినాడ సభలో తొక్కిసలాట, ఒకరు మృతి
అమరావతి: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ పేరిట సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన సభలో విషాదం చోటు చేసుకుంది. ఈ బహిరంగ సభలో జరిగిన తొక్కిసలాటలో ఒక యువకుడు మృతి చెందగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.
మరణించిన యువకుడిని తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలం కుయ్యూరుకు చెందిన శ్రీనుగా గుర్తించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ సభను వీక్షించేందుకు సభా స్థలిలోని చెట్లు ఎక్కిన యువకులు కొందరు కిందపడి గాయాలపాలయినట్లు తెలిసింది.

గాయపడిన వారిని కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషయంగా ఉందని వైద్యులు తెలిపారు. కిందపడిన వారిని తొక్కుకుంటూ మరికొందరు వెళ్లడంతో పరిస్థితి విషమించింది. పవన్ తన ప్రసంగాన్ని ప్రారంభించడానికి ముందే అభిమానులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
అయినప్పటికీ తమ అభిమాన నటుడిని చూడాలన్న ఆత్రంతో గాయాలపాలయ్యారు. ఇదిలా ఉంటే 'మాకు డబ్బులు పంచే నాయకులు వద్దు, మందు పోసే మోసగాళ్లు వద్దు ప్రజా సమస్యలపై పోరాడే పవన్ లాంటి పోరాటయోధుడు కావాలి' అని కాకినాడ సభకు హాజరైన అభిమానులు అన్నారు.
తామంతా పవన్ కళ్యాణ్ వెనకే ఉంటామని స్పష్టం చేశారు. తమకు కుటుంబం అంటే ఎంత ఇష్టమో పవన్ అన్నా అంతే ఇష్టమని వారు తెలిపారు. పవన్ సభ కోసమే ఎంతో దూరం నుంచి కాకినాడ వచ్చామన్నారు. హోదా సాధించగలను అనుకునే నాయకులందరూ తమతో కలిసి రావాలని ఫ్యాన్ అంటున్నారు.












Click it and Unblock the Notifications