ఇది ఆ అధికారి తీరు: జేసీ పేరుచెప్పి రూ.1.5లక్షలు కాజేశాడు
విశాఖపట్నం: ఓ ప్రభుత్వాధికారి చేతివాటం వెలుగుచూసింది. ఏకంగా జిల్లా జాయింట్ కలెక్టర్ పేరుచెప్పి రూ.లక్షన్నర దోపిడీ చేశాడు సదరు ప్రభుత్వ అధికారి. ఈ ఘటన జిల్లాలోని అనకాపల్లిలో చోటుచేసుకుంది.
ఆర్డీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ వల్లేశ్వరరావు జిల్లా జాయింట్ కలెక్టర్ సృజన పేరు చెప్పి ఓ వ్యక్తి నుంచి రూ. 1.5లక్షలు వసూలు చేశాడు. భూ మార్పిడి పత్రం కోసం జేసీకి డబ్బు ఇవ్వాలంటూ వల్లేశ్వరరావు ఆ వ్యక్తితో చెప్పగా.. రూ.1.5లక్షలు చెల్లించాడు.

అనంతరం జేసీని కలిసిన బాధితుడు.. ఈ వ్యవహారాన్నంతా ఆమె దృష్టికి తీసుకెళ్లడంతో అసలు విషయం బయటపడింది. దీంతో విచారణ జరిపిన జేసీ ఉద్యోగిని విధులనుంచి సస్పెండ్ చేశారు.
అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. కాగా, ఉద్యోగి వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి బాధితుడికి అందేలా చర్యలు తీసుకుంటామని జేసీ తెలిపారు.












Click it and Unblock the Notifications