ఫోన్లో మాట్లాడుతున్న కూతురును కొట్టి చంపేశాడు: ప్రేమించిందనే కొట్టాడు: తాత ఫిర్యాదు
విజయవాడ: కృష్ణా జిల్లాలో శనివారం పరువు హత్య కలకలం చోటు చేసుకుంది. కన్న తండ్రి కూతురును గొడ్డలితో నరికి చంపేశాడు. ఈ సంఘటన జిల్లాలోని చందర్లపాడు మండలం తోటరావులపాడు గ్రామంలో చోటు చేసుకుంది. కూతురు ఓ వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతుండటంతో అనుమానంతో ఆ తండ్రి ఈ దారుణానికి పాల్పడ్డాడు. కూతురు అతనితో ప్రేమలో ఉందని తండ్రి భావించాడు.
అమ్మాయి పేరు చంద్రిక. బిటెక్ చదువుతోంది. వయస్సు 23. తండ్రి కూతురును చంపడాన్ని చూసిన తల్లి స్పృహ కోల్పోయింది. చంద్రిక శుక్రవారం రోజు పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంది. శనివారం తండ్రి కారణంగా మృతి చెందింది. కోటయ్య, పద్మావతి దంపతులకు ఇద్దరు కూతుళ్లు. కోటయ్య వ్యవసాయం చేస్తుంటాడు. పద్మావతి ఉపాధి హామీ పథకంలో క్షేత్ర సహాయకురాలిగా విధులు నిర్వహిస్తున్నారు.
పెద్ద కూతురు చంద్రిక. గుడ్లవల్లేరులోని కళాశాలలో బీఫార్మసీ పూర్తి చేసింది. పై చదువుల కోసం సిద్ధమవుతోంది. శనివారం ఇంట్లో ఆమె సెల్ఫోన్లో మాట్లాడుతుండగా గమనించిన తండ్రి ఆగ్రహంతో కర్రతో గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. కళ్ల ముందే కుమార్తె విగత జీవిగా మారడంతో తల్లడిల్లిన తల్లి స్పృహ కోల్పోయారు. చంద్రిక ప్రాణాలు కోల్పోయిందని గమనించిన తండ్రి ఇంట్లో నుంచి పారిపోయాడు. ఆ తర్వాత పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.
తండ్రిపై తాతయ్య ఫిర్యాదు
ఈ ఘటనపై పద్మావతి తండ్రి రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోటయ్య ఆవేశంలో కొట్టడంతోనే చంద్రిక చనిపోయిందని తెలిపారు. తాను ఒకరిని ప్రేమించానని, అతడిని పెళ్లి చేసుకుంటానని ఆమె చెప్పడంతో తండ్రి ఆవేశంలో కొట్టాడని, దీంతో మృతి చెందిందని తాతయ్య ఫిర్యాదులో పేర్కొన్నారు.