కిడ్నీ కోసం తల్లి సోదరిని హత్య చేసిన ఘనుడు
చిత్తూరు: తాగుడుకు బానిసైన కిడ్నీ విక్రయించి డబ్బులు సంపాదించడదానికి ఓ వ్యక్తి తన తల్లి సోదరిని హత్య చేసిన దారుణమైన సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. లక్ష్మి అనే వివాహితను ఆమె అక్క కుమారుడు చిత్తూరు జిల్లా రామకుప్పం మండల పరిధిలోని వీర్నమల తాండ గ్రామంలో హత్య చేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
సోమవారంనాడు గ్రామానికి చెందిన శ్యామరాజు (30) అనే వ్యక్తి ఈ హత్యకు పాల్పడ్డాడని అంటున్నారు. ఇతను తరచూ మద్యం సేవించి దొంగతనాలు చేసుకుంటూ బతికేవాడని స్థానికులు తెలిపారు. అతనికి తమిళనాడులోని వైద్యులతో పరిచయం ఉండటంతో వారికి కిడ్నీ అవసరం నిమిత్తం ఈ ఘటనకు పాల్పడ్డాడని స్థానికులు తెలిపారు.
మంగళవారం సాయంత్రం లక్ష్మిని పలకరించడానికి స్థానికులు వెళ్లారు. ఇంతలో శ్యామరాజు బయటకు వచ్చి ఆమె వేరేచోటికి వెళ్లిందని తెలిపాడు. ఆ తర్వాత బంధువులు ఆమెతో మాట్లాడటానికి వచ్చి తలుపులు తెరచి చూడగా రక్తపుమడుగు కన్పించిందని తెలిపారు. దీంతో శ్యామరాజుపై అనుమానం ప్రారంభమైంది.
వీర్నమల తండా శివారు అయిన గురుకుల మడుగు సమీపంలోని అడవిలో ఆమె శరీరాన్ని రెండు భాగాలుగా నరికి పై భాగానికి నిప్పంటించాడు. ఇతనికి సహకరించిన రవినాయక్ (30)ను స్థానిక ఎస్సై పరశరాముడు సిబ్బందితో కలసి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
కాగా కోపోద్రిక్తులైన వీర్నమల తండా గ్రామస్థులు శ్యామరాజు ఇంటి గోడలు బద్దలుకొట్టి ఇంట్లోని సామగ్రికి నిప్పటించారు. లక్ష్మి కుమారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.