వదినను పెళ్లి చేసుకున్నాడు: అనుమానతో చంపేసి తగులబెట్టాడు
నెల్లూరు: భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దాంతో ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేసి, ఆ తర్వాత శవాన్ని తగులబెట్టాడు. ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. అయితే, అతను పోలీసుల నుంచి తప్పించుకోలేకపోయాడు, అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నెల్లూరు జిల్లా కనిగిరి మండలం పాతపాడుకు చెందిన రమణమ్మ, వెంకటేశ్వర్లు రెండో కూతురు మార్తాల సుమలత(28)ను అదే గ్రామానికి చెందిన రవీంద్రబాబుకు ఇచ్చి వివాహం చేశారు. వీరు నెల్లూరులోని చలపతినగర్లో జీవిస్తున్నారు. వీరికి పవన్ (8) మదన్ (5) అనే ఇద్దరు కొడుకులున్నారు. రవీంద్ర బాబు పలు రకాల వ్యాపారం చేస్తూ ఆర్థికంగా స్ధిర పడ్డారు.
అయితే, 2012లో మొలల ఆపరేషన్ సమయంలో వైద్యం వికటించడంతో రవీంద్రబాబు మృతి చెందాడు. దీంతో రవీంద్రబాబు సోదరుడు శ్రీకాంత్ నాలుగేళ్ల క్రితం వదిన సుమలతను వివాహం చేసుకున్నారు. శ్రీకాంత్ తల్లిదండ్రులు హైదరాబాద్లో ఓ హోటల్ నిర్వ హిస్తుండగా శ్రీకాంత్ కూడా ఓ కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ తల్లి దండ్రుల వద్దనే ఉంటూ వచ్చాడు. అప్పుడప్పుడు మాత్రమే భార్య వద్దకు వచ్చేవాడు.
కొంతకాలంగా తన భార్య స్థానికంగా ఉండే ఓ ఆటోడ్రైవర్తో చనువుగా ఉంటుందన్న అనుమానంతో తరచూ ఆమెతో గొడవ పడుతుండేవాడని చెబుతున్నారు. మూడు రోజుల క్రితం నెల్లూరుకు వచ్చిన శ్రీకాంత్ ఈ విషయమై భార్యతో తగాదాకు దిగాడు. సోమవారం కూడా ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరగడంతో ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలను అంగడికి పంపించాడు.
తిరిగి వాళ్లు వచ్చే సమయానికి తన భార్య ఆత్మ హత్య చేసుకుందని అంటూ ఇరుగుపొరుగువారిని పిలిచాడు. అయితే పిల్లలను బయటకు పంపించి ఆమెను రోకలిబండతో కొట్టి అనంతరం మృత దేహాన్ని బాత్రూమ్లో వేసి పెట్రోలు పోసి నిప్పంటిచినట్లు ఆరోపిస్తున్నారు.
భార్యను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడన్న అనుమానంతో కొందరు స్థానికులు ఐదోనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం సంఘటనా స్ధలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి మృతురాలి భర్త శ్రీకాంత్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.