మనవరాలిపై తాత అఘాయిత్యం: ఆపై బురదలో తొక్కి హత్య
ఓ వ్యక్తి తన మనవరాలి పట్ల అత్యంత కిరాతకంగా వ్యవహరించాడు. ఆమెపై లైంగిక దాడి చేసి ఆ తర్వాత ఆమెను దారుణంగా హత్య చేశాడు.
ఏలూరు: ఓ వ్యక్తి తన మనవరాలిపై లైంగిక దాడికి పాల్పడి ఆమెను అత్యంత దారుణంగా హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. అతన్ని గురువారం గణపవరం పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.
గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ ఎన.దుర్గాప్రసాద్ సంఘటన వివరాలు వెల్లడించారు. గణపవరం మండలం కేశవరం గ్రామానికి చెందిన గంగిరెద్దుల జాతికి చెందిన బొడ్డి ఏసు (50) సంత మార్కెట్లో డేరాలు వేసుకుని జీవిస్తున్నాడు.
గత నెల 29వ తేదీన ఉగాది రోజున ఇంటిలో ఎవ్వరూ లేని సమయంలో తన మనుమరాలు రెండున్నర ఏళ్ల వయస్సు గల మేరీ రాణిని రాత్రి 8 గంటల సమయంలో చంకనేసుకుని సమీప పొలం గట్ల వద్దకు తీసుకువెళ్ళి లైంగిక దాడి చేసి అనంతరం బురదలోకి తొక్కి చంపేశాడు. ఆ తర్వాత ఏమీ జరగనట్లు తిరిగి వచ్చి తెల్లవారుజామున భిక్షాటన కోసం వెళ్ళిపోయాడు.
కాగా, తన కూతురు కనిపించకపోవడంతో ఏసు కుమారుడు, కోడలు రాత్రి నుంచి అన్వేషించాడు. మర్నాడు ఉదయం 9 గంటలకు పంటబోదె బురదలో కూతురు మృతదేహం కనిపించింది. ఈ ఘాతుకానికి ఒడిగట్టింది తన మామ ఏసేనని గుర్తించి కోడలు పోసమ్మ గణపవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు ఏలూరు డీఎస్పీ బి.వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో గణపవరం సీఐ ఎన.దుర్గాప్రసాద్ నిందితుడు ఏసును అరెస్టు చేసి గురువారం తాడేపల్లిగూడెం కోర్టుకు తరలించారు.