మంచిరెడ్డి ఇష్యూ: కుమారుడితో నారా లోకేష్ తెరవెనక ప్రయత్నం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం శానససభ్యుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డిని పార్టీ మారకుండా నిలువరించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుమారుడు ప్రశాంత్ రెడ్డితో ఆయన రాయబారం నడపడానికి ప్రయత్నించారు.
తెలుగుదేశం పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా కూడా మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఉన్నారు. మంగళవారంనాడు మంచిరెడ్డి కిషన్ రెడ్డితో నారా లోకేష్ మాట్లాడడానికి ప్రయత్నించారని సమాచారం. అయితే, తాను తన స్వగ్రామం ఎలిమినేడులో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఉన్నానని మంచిరెడ్డి కిషన్ రెడ్డి చెప్పారు.
మంచిరెడ్డి కిషన్ రెడ్డి సరైన సమాధానం రాకపోవడంతో నారా లోకేష్ వెంటనే ఆయన కుమారుడు ప్రశాంత్ రెడ్డిని పిలిపించుకున్నారు. దాంతో ప్రశాంత్ రెడ్డి మంగళవారంనాడు నారా లోకేష్ను కలిశారు.
అయితే, తాను తన తండ్రికి చెప్పి చూస్తానని ప్రశాంత్ రెడ్డి నారా లోకేష్తో చెప్పినట్లు సమాచారం. అయితే, నారా లోకేష్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్బై చెప్పి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్)లో చేరడానికే నిర్ణయించుకున్నారు.