రాష్ట్రం కన్నా ఆ రెండింటిలో గెలుపే ప్రతిష్టాత్మకం!!
2024లో జరగబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. నాయకులు, కార్యకర్తలకు ఆయన రెండో ఆప్షన్ ఇవ్వడంలేదు. గెలుపు, ఓటమి అంటూ రెండు అవకాశాలున్నప్పటికీ మన పార్టీకి రెండో అవకాశం లేదంటూ చెప్పేస్తున్నారు. విజయం కోసమే పనిచేయాలని సూచిస్తున్నారు. అధికారం కోల్పోతే రాజకీయంగా విపరిణామాలు సంభవిస్తాయని, అటువంటి అవకాశాన్ని కొనితేవద్దని హెచ్చరిస్తున్నారు.
ఇక్కడి గెలుపు రాష్ట్ర గెలుపు అవుతుంది!
ఎన్నికలు ఎప్పుడు జరిగినా అమరావతి పరిధిలోని తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాలు మాత్రం వైసీపీ పరమవ్వాలని నాయకులకు జగన్ ఆదేశాలు జారీచేశారు. రాజధాని పరిధిలోని నియోజకవర్గాలు కావడంతో ఇక్కడ గెలిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజలు మూడు రాజధానులకు అనుకూలంగా ఉన్నారని, దానికి నిదర్శనమే తాడికొండ, మంగళగిరిలో గెలుపు అని ప్రజలకు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఎక్కడ ఓటమిపాలైనా పర్వాలేదుకానీ ఈ రెండు నియోజకవర్గాల్లో మాత్రం విజయఢంకా మోగించాలని పార్టీ శ్రేణులకు ఒకటికి రెండుసార్లు స్పష్టం చేస్తున్నారు.
మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయి!
ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రకటించడంతోపాటు కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్రను సమానంగా అభివృద్ధి చేయాలనేది వైసీపీ ఉద్దేశమని, అమరావతిని రాజధానిగా ప్రకటించడంవల్ల జరిగే నష్టాలు? చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు? నష్టపోయేవారు? తదితర వివరాలతోపాటు జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని ఎందుకు తీసుకోవల్సి వచ్చింది? మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తే జరిగే లాభాలు? రాష్ట్రాభివృద్ధి తదితర అంశాలను ప్రజలకు విపులంగా చెప్పాలని స్పష్టం చేస్తున్నారు.
తాడికొండ, మంగళగిరి రెండూ గెలవాలి?
తాడికొండలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఉండవల్లి శ్రీదేవిపై సొంత పార్టీలోని నాయకులే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఇన్ఛార్జిగా టీడీపీ నుంచి వచ్చిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ను నియమించారు. దీంతో వైసీపీ శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోయారు.
ఇద్దరు నేతల అనుచరులు గలాటాలు సృష్టిస్తుండటంతో వారిపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళగిరిలో వరుసగా రెండుసార్లు విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లిక పంపిస్తారంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఎవరూ ఖండించడంలేదు. ఒకవేళ ఆళ్ల సత్తెనపల్లికి వెళితే గంజి చిరంజీవి అభ్యర్థి అవుతారంటున్నారు.
ఇక్కడి నుంచి నారా లోకేష్ బరిలోకి దిగుతుండటం కూడా జగన్ దీన్ని ప్రతిష్టాత్మకంగా భావించడానికి మరో కారణం. రెండు నియోజకవర్గాల్లో సాధించే గెలుపే రాష్ట్ర గెలుపుగా ఉంటుందని, మూడు రాజధానులపై అడుగు ముందుకు వేయడానికి పునాది అవుతుందని జగన్ నాయకులు ఉద్భోదించారు.