చంద్రబాబును ఫిక్స్ చేస్తున్న కాంగ్రెస్ - జగన్ వ్యతిరేక ఓటు చీలిక, కొత్త లెక్కలు..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. మరోసారి అధికారం ఖాయమనే ధీమాతో జగన్ ఉన్నారు. సంక్షేమం - సామాజిక న్యాయం తనకు కలిసి వస్తాయని జగన్ నమ్ముతున్నారు. జగన్ ను ఓడించే లక్ష్యంతో చంద్రబాబు, పవన్ ఒక్కటయ్యారు. ఈ ఇద్దరితో బీజేపీ కలిసి వస్తుందనే అంచనాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ఏపీలో కాంగ్రెస్ కొత్త వ్యూహాలతో వస్తోంది. జగన్ తో పాటుగా చంద్రబాబును టార్గెట్ చేస్తోంది. దీంతో, వ్యతిరేక ఓటు లెక్క మారుతోంది.
కాంగ్రెస్ వై నాట్ ఏపీ: కర్ణాటక, తెలంగాణలో విజయం తరువాత దక్షిణాదిన ఇప్పుడు కాంగ్రెస్ వై నాట్ ఏపీ అనే నినాదం మొదలు పెట్టింది. ఏపీ ఇంఛార్జ్ బాధ్యతలను మాణికం ఠాగూర్ కు అప్పగించింది. ఈ నెల 4న షర్మిల అధికారికంగా కాంగ్రెస్ లో చేరనున్నారు. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ లో కీలక బాధ్యతలు ఇవ్వాలని పార్టీ నాయకత్వం ఆలోచన చేస్తోంది.

షర్మిల అంగీకరిస్తే ఏపీ పీసీసీ బాధ్యతలు ఇవ్వాలని భావిస్తోంది. షర్మిల అందుకు సుముఖంగా లేకుంటే పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా బాధ్యతలు అప్పగించి రాజ్యసభకు పంపాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో షర్మిలను ఏపీ నుంచి ఎంపీగా పోటీ చేయించాలనే ఆలోచనలో పార్టీ హైకమాండ్ ఉందనే ప్రచారం సాగుతోంది.
వ్యతిరేక ఓటు దక్కేదెవరికి: షర్మిల కాంగ్రెస్ లో యాక్టివ్ అయితే ముఖ్యమంత్రి జగన్ ఓట్ బ్యాంక్ కు గండి పడుతుందని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకత్వం అటు జగన్ తో పాటుగా ఇటు చంద్రబాబు, పవన్ ను టార్గెట్ చేయటం ప్రారంభించింది. తాజాగా మాణికం ఠాగూర్ ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేన బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నాయని ఆరోపించారు.
విభజన జరిగి తొమ్మిదిన్నారేళ్లు అయినా ఏపీకి ప్రత్యేక హోదా రాలేదన్నారు. జగన్ పరోక్షంగా బీజేపీతో మైత్రి కొనసాగిస్తున్నారన్నారు. జనసేన నేరుగా బీజేపీకి మిత్రపక్షంగా ఉందని చెప్పుకొచ్చారు. బీజేపీతో పొత్తు కోసం టీడీపీ నిరీక్షిస్తుందని చెప్పుకొచ్చారు. ఈ మూడు పార్టీలు రాష్ట్రానికి మేలు చేయలేవని..ఏపీ కోసం కాంగ్రెస్ మాత్రమే పని చేస్తుందని పేర్కొన్నారు. ఏపీకి హోదా, స్టీల్ ప్లాంట్ అంశంలో కాంగ్రెస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేసారు.

ఏపీలో మారుతున్న లెక్కలు: జగన్ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతో తాము పొత్తు కుదుర్చుకున్నట్లు పవన్, చంద్రబాబు పలు సందర్భాల్లో చెప్పారు. కానీ, అనూహ్యంగా కాంగ్రెస్ ఏపీలో కొత్త పొత్తులు, లెక్కలతో బరిలోకి దిగుతున్న వేళ ఈ వ్యతిరేక ఓటు లెక్క మారుతోంది. టీడీపీ,జనసేన, బీజేపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే..కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో కలిసి పోటీ చేయటం ఖాయంగా కనిపిస్తోంది. అటు వైసీపీ సింగిల్ గా పోటీ చేయనుంది.
మాజీ జేడీ పార్టీ, ఇతర పార్టీలు బరిలో నిలవనున్నాయి. దీంతో..జగన్ వ్యతిరేక ఓటు టీడీపీ - జనసేనకు మాత్రమే వస్తుందనే చంద్రబాబు అంచనాలు ఫలించే అవకాశం కనిపించటం లేదు. అటు జగన్ పాజిటివ్ ఓట్ తనను గెలిపిస్తుందనే ధీమాతో ఉన్నారు. ఈ లెక్కల నడుమ ఏపీ ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications