చేరికలకి ఎన్నో కారణాలు: 'రాజధాని' డబ్బుతో జగన్ని దెబ్బతీస్తున్నారా?
విజయవాడ: ఏపీలో ఓ వైపు వైసిపి నుంచి టిడిపిలోకి ఎమ్మెల్యేల చేరికలు, మరోవైపు ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రికలో సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్, ఎంపీ మురళీ మోహన్, పలువురు మంత్రులు, టిడిపి నేతల పైన తీవ్ర ఆరోపణలతో రాజకీయ వేడి మరింతగా రాజుకుంది.
గత కొద్ది రోజులుగా వైసిపి నుంచి పలువురు ఎమ్మెల్యేలు టిడిపిలోకి వస్తున్నారు. ఏడెనిమిది మంది ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కారు. మరికొంతమంది ప్రజాప్రతినిధులు కూడా టిడిపిలో చేరేందురు సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ నేతలు, మంత్రులు చెబుతున్నారు.
ఎమ్మెల్యేల చేరిక పైన టిడిపి నేతలు, వైసిపి నేతలు పరస్పరం విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిని చేసే ఎమ్మెల్యేలు టిడిపిలోకి వస్తున్నారని, తాము ఎలాంటి ప్రలోభాలకు వారిని గురి చేయడం లేదని చెబుతున్నారు.
వైసిపి అధినేత జగన్.. ప్రభుత్వాన్ని పడగొడతానని, 21 మంది టిడిపి ప్రజాప్రతినిధులు తనతో టచ్లో ఉన్నారని చెప్పారని, ఆ తర్వాతనే వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారని ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి చెప్పారు.
అలాగే, పట్టిసీమ వంటి ప్రాజెక్టు ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, దీంతో ప్రజలు చంద్రబాబుకు అండగా ఉంటున్నారని, ఇది గమనించే వైసిపి సీమ ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కుతున్నారని మరికొందరు టిడిపి నేతలు చెబుతున్నారు.
మొత్తానికి జగన్ వ్యాఖ్యలు, చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి, ప్రజలు టిడిపి వైపు ఉండటాన్ని చూసి వైసిపి ఎమ్మెల్యేలు తమ వైపుకు వస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు.
వైసిపి ఎమ్మెల్యేలను చేర్చుకొని జగన్ను మానసికంగా దెబ్బతీస్తున్న సమయంలో జగన్కు చెందిన సాక్షి మీడియా బుధవారం నాడు బాంబు పేల్చింది. రాజధాని అమరావతి ప్రాంతంలో టిడిపి నేతలు పెద్ద ఎత్తున భూములు కొన్నారని, రాజధాని ప్రకటనకు 2 నెలల ముందే వారు భూములు కొన్నారని ఆరోపించింది.
వీటిని టిడిపి నేతలు కొట్టి పారేస్తున్నారు. వైసిపి, సాక్షి మీడియా దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. మరోవైపు వైసిపి నేతలు కూడా సాక్షి పత్రిక వార్తల ఆధారంగా ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్నారు. వైసిపి నేతలు బొత్స సత్యనారాయణ, వైవి సుబ్బారెడ్డిలు బుధవారం మాట్లాడారు.
రాజధాని అమరావతిలో టిడిపి నేతలు ముందుగానే భూములు చవకగా కొన్నారని, లోకేష్ వంటి వారు బినామీల పేర్ల మీద రాయించుకున్నారని, ఆ తర్వాత రాజధాని ప్రకటన చేశారని బొత్స ఆరోపించారు. రాజధాని పేరుతో టిడిపి నేతలు దోచుకుంటున్నారని, ఆ దోచుకున్న డబ్బుతో తమ ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపిస్తున్నారు.