వైసిపి ఎమ్మెల్యేలపై పత్తిపాటి సంచలనం, కడపలో లోకేష్ ఆపరేషన్
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు మార్చి 5వ తేదీలోగా తెలుగుదేశం పార్టీలోకి వస్తారో మీరే చూస్తారని మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆదివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. వైసిపి పైన ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యేలకు నమ్మకం పోయిందన్నారు. తండ్రిని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని దోచుకున్న ఆ పార్టీ అధ్యక్షులు జగన్ను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ప్రస్తుతం అసహనంలో ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమాలను చూసి టిడిపిలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
Also Read: సీమకు వెళ్లిపోతారు: బెజవాడకి బాబు హెచ్చరిక, ఏకైక సీఎంగా రికార్డ్!
ఎవరిది మైండ్ గేమో అసెంబ్లీ సమావేశాల్లోపు స్పష్టత వస్తుందన్నారు. నిజాయతీగా రాష్ట్ర అభివృద్ధికి కష్టపడుతున్న సీఎం చంద్రబాబు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్లపై ఓ పత్రిక రాస్తున్న అవినీతి రాతలను ప్రజలు నమ్మడం లేదని.. సాక్షి పత్రికను ఉద్దేశించి అన్నారు. ఇప్పటికే ఆ పత్రిక ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు.
24న టిడిపిలోకి కడప కార్పోరేటర్లు
ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. శనివారం గుంటూరు జిల్లాకు చెందిన పలువురు వైసిపి సర్పంచులు టిడిపిలో చేరారు. కడప జిల్లాలోను పలువురు ప్రజాప్రతినిధులు టిడిపిలో చేరనున్నారని తెలుస్తోంది. కడప కార్పోరేటర్లు కొందరు ఈ నెల 24వ తేదీన నారా లోకేష్ సమక్షంలో సైకిల్ ఎక్కనున్నారు. ఇందులో డిప్యూటీ మేయర్ అరీఫుల్లా కూడా ఉన్నారని తెలుస్తోంది.
ప్రత్యేక హోదాపై అశోక్ గజపతి రాజు వ్యాఖ్యలు
రాష్ట్ర విభజన తర్వాత ఆర్థిక లోటుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్రం సానుకూలంగానే ఉందని టిడిపి సీనియర్ నేత, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు ఆదివారం చెప్పారు.
అయితే తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, సిద్దరామయ్య, నవీన్ పట్నాయక్, జయలలితలు అభ్యంతరం చెబుతున్నారన్నారు. ఈ నలుగురు సీఎంల అభ్యంతరాలతోనే ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటన ఎప్పటికప్పుడు వాయిదా పడుతోందన్నారు.