ఆర్కే ఆచూకీపై హైకోర్టులో భార్య శిరీష పిటిషన్ దాఖలు
హైదరాబాద్: మావోయిస్టు అగ్రనేత ఆర్కే ఆచూకీపై ఆయన భార్య శిరీష హైకోర్టును ఆశ్రయించారు. ఆర్కే కోసం ఆమె లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా కేసును విచారించాలంటూ ఆమె దాఖలు చేసిన హేబియస్ పిటిషన్లో శిరీష కోరారు. ఈ పిటిషన్ సోమవారం మధ్యాహ్నం 2.30గంటలకు విచారణకు రానుంది.
పోలీసుల అదుపులో ఉంటే 24గంటలలోపు కోర్టులో హాజరుపర్చేలా ఆదేశించాలని శిరీష కోర్టును కోరారు. తన పిటిషన్లో ఆంధ్రప్రదేశ్ డీజీపీ, ఏపీ ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చారు.
కాగా, అక్టోబర్ 24న జరిగిన భారీ ఎన్కౌంటర్లో గాయపడిన ఆర్కే.. తప్పించుకున్నారని మొదట వార్తలు వచ్చాయి. ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతంలోనే ఆర్కేను చంపేసిన పోలీసులు.. అక్కడే పూడ్చిపెట్టారనే మరో వాదన కూడా వినిపిస్తోంది. విరసం నేత వరవరరావు కూడా పోలీసుల అదుపులోనే ఆర్కే ఉన్నారని ఆరోపించారు.

శిరీష పిటిషన్ పై పోలీసులు ఏ విధమైన సమాధానం తెలియజేస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది. కాగా, గతంలో కూడా ఆర్కే వారం నుంచి 15రోజుల వరకు ఎవరికీ అందుబాటులో లకుండాపోయి మళ్లీ వచ్చిన సందర్భాలున్నాయి.
జాడలేదు, బతికే ఉన్నాడు: శిరీష
తన భర్త ఆర్కే జాడ తెలియడం లేదని ఆయన భార్య శిరీష తెలిపారు. ఆయన పోలీసుల అదుపులోనే ఉన్నాడని తమ అనుమానమని, వెంటనే ఆర్కేను కోర్టులో హాజరుపర్చాలని తాను పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు. కన్న కొడుకును పోగొట్టుకున్న పుట్టెడు దు:ఖంలో ఉన్నానని, కనీసం తన భర్తనైనా చూపెట్టాలని కంటతడి పెట్టారు.
అంతటా కూంబింగ్ జరుగుతున్న క్రమంలో ఆర్కే తప్పించుకునే అవకాశం లేదని, ఆయనను పోలీసులే అదుపులోకి తీసుకుని ఉంటారని చెప్పారు. వెంటనే ఆయనను కోర్టులో హాజరుపర్చాలని కోరారు. ఆర్కే జాడ తెలియక వారం రోజులవుతోందని అన్నారు. ఇంజినీరింగ్ చదివిన తన కుమారుడు తన తండ్రిని కలిసేందుకు వెళ్లి.. అక్కడి పరిస్థితిల నేపథ్యంలో మావోయిస్టుల్లో కలిశారని చెప్పారు.
మావోయిస్టుల మృతదేహాల ఖననం
ఎదురుకాల్పుల్లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను తీసుకెళ్లేందుకు వారి కుటుంబాలు రాకపోవడంతో పోలీసులే వారి మృతదేహాలను మల్కాన్గిరి ప్రాంతంలోన ఖననం చేశారు. సోమవారం 12మంది మావోల మృతదేహాలను పోలీసులు ఖననం చేశారు.












Click it and Unblock the Notifications