మావోల మరో హెచ్చరిక: " ఎన్కౌంటర్ కారకులకు శిక్ష తప్పదు"
హైదరాబాద్ : ఏఓబీ ఎన్ కౌంటర్ లో 30మంది మావోయిస్టులను మట్టుబెట్టిన నేపథ్యంలో.. ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకుంటామని, అవసరమైతే ఆత్మాహుతి దాడులు చేసైనా సరే.. అంతకంతకు దెబ్బ కొడుతామని భారత కమ్యూనిస్టు పార్టీ అధికార ప్రతినిధి శ్యాం ఇదివరకే హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఇక తాజాగా సీపీఐఎంఎల్ మావోయిస్టు పార్టీ కూడా ఎన్ కౌంటర్ కారకులు శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించింది. మావోయిస్టు ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాసం ఓ ఆడియో టేపు ద్వారా ఈ ప్రకటనను విడుదల చేశారు. ఎన్ కౌంటర్ ముమ్మాటికీ బూటకమేనని ఆగ్రహం వ్యక్తం చేసిన కైలాసం.. విద్రోహ చర్యల్లో భాగంగానే తమ కామ్రేడ్లు అమరులయ్యారని ప్రకటించారు.
ఏఓబీ సరిహద్దు ప్రాంతమైన రామగూడలో జరిగిన ఈ ఎన్ కౌంటర్ కు ఆంధ్రా, ఒడిశా సీఎంలే బాధ్యత వహించాలని ఆడియో టేపు ద్వారా కైలాసం డిమాండ్ చేశారు. ప్రకృతి వనరులను దోచుకునేందుకే ప్రభుత్వాలు మావోయిస్టు నిర్మూలన చర్యలను చేపడుతున్నాయని మండిపడ్డారు. గ్రీన్ హంట్ మూడో దశను అత్యంత క్రూరంగా అమలు జరుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ చర్యలను చూసి బెదిరేది లేదని, హత్యలతో విప్లవాన్ని ఆపలేరని, బూటకపు ఎన్ కౌంటర్ కారకులకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో మరికొంతమంది మావోలు ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేసిన కైలాసం.. వారందరినీ విడతలవారిగా చంపేసి ఎన్ కౌంటర్ గా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందన్నారు.
ఇక మావో అగ్రనేత ఆర్కే పోలీసుల అదుపులోనే ఉన్నాడన్న వరవరరావు ఆరోపణలపై స్పందిస్తూ.. ఆ విషయంపై స్పష్టత లేకపోయినా.. అనుమానాలైతే ఉన్నాయన్నారు. పోలీసుల అదుపులోని మావోయిస్టులను కోర్టులో హాజరుపరచాలని, ఏపీ ఎస్ఐబీ, ఒడిశా ఇంటెలిజెన్స్ తమ శిక్ష నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే, మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో.. మంత్రులు ఎక్కడికెళ్లినా.. ముందస్తుగా పోలీసులకు సమాచారం అందించాలని పోలీస్ యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. ఏ పర్యటనకు వెళ్లే ముందైనా సరే, తమకు తప్పనిసరిగా సమాచారం అందించాలని, మావోయిస్టులు ఏ క్షణానైనా దాడులకు పాల్పడే అవకాశముందని మంత్రులను అలర్ట్ చేస్తున్నారు పోలీస్ ఉన్నతాధికారులు.