మరిది బూతులకు?: తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య..
మరిది అవమానించినందుకే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఏలూరు: భర్త నుంచి ఎదురవుతున్న వేధింపులు.. వదిన అన్న కనీస గౌరవం లేకుండా మరిది చేసిన దుర్భాషలు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. కనసాల వీరవెంకటరావుకు నిడదవోలు మండలం తాడిమళ్ల గ్రామానికి చెందిన మరియమ్మకు 15 క్రితం వివాహమైంది. వీరికి సామ్యూల్కిరణ్, శివరామకృష్ణ అనే ఇద్దరు పిల్లలున్నారు. కొన్నాళ్లు బాగానే ఉన్నప్పటికీ.. అదనపు కట్నం కోసం అత్తింటి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి.
దీంతో పలుమార్లు పెద్దమనుషులతో పంచాయితీ పెట్టడం.. మళ్లీ గొడవలు జరగడం కామన్గా మారిపోయింది. ఇటీవల మరోసారి గొడవ తలెత్తి భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. ఇదే క్రమంలో ఆదివారం మరిదికి, ఆమె భార్యకు మధ్య గొడవ జరిగింది. మధ్యలో మరియమ్మ వెళ్లి మరిదిని వారించింది. దీంతో కోపోద్రిక్తుడైన మరిది.. ఆమెపై నానా దుర్భాషలాడాడు. మనస్తాపం చెందిన మరియమ్మ ఇంట్లోకి వెళ్లి తలుపులు పెట్టుకుంది.
తలుపులు బద్దలు కొట్టి మరియమ్మను కాపాడే ప్రయత్నం చేసేలోపే ఆమె మృతి చెందింది.. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతురాలు కొడుకులు, బంధువుల నుంచి వివరాలు సేకరించారు. తన కుమార్తెను భర్త, మరిది పథకం ప్రకారం హత్య చేశారని మరియమ్మ తల్లీదండ్రులు ముంగర వెంకమ్మ, చినవెంకటేశులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.