రాజమండ్రిలో మసీదు మౌజస్ హత్య.... డిజిపితో మాట్లాడిన చంద్రబాబు
Recommended Video

తూర్పుగోదావరి: రాజమహేంద్రవరంలో మసీదు మౌజస్ దారుణ హత్యకు గురవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మౌజస్ హత్య విషయం తెలిసి జాతీయ రహదారిపై ముస్లింలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మరోవైపు ఈ హత్య కేసు విషయమై ఇప్పటికే డీజీపీతో మాట్లాడానని, హత్య కేసులో నిందితులను త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.
శుక్రవారం వేకువజామున ఫజా కోసం గేటు కీపర్ గౌస్ మసీదులోకి వెళ్లి చూడగా ఫారూఖ్ తలపై బలమైన గాయాలతో విగతజీవుడై పడి ఉన్నాడు. పక్కనే ఖురాన్ కాల్చివేసి ఉండటంతో పాటు ప్రార్థనాస్థలం అగ్నికి ఆహుతై ఉన్నాయి. ఇమామ్ వెంటనే మసీదు కమిటీకి, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఈ హత్య శుక్రవారం వేకువ జామున జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

స్వస్థలం...బీహార్
బీహార్ రాష్ట్రం భగన్పూర్ జిల్లా బగార్థాకు చెందిన మహ్మద్ ఫారూఖ్ (61) మూడు నెలల క్రితం రాజమహేంద్రవరం లాలాచెరువులోని నూరానీ మసీదులో మౌజస్ గా అంటే చిన్నమతగురువుగా చేరి అక్కడే నివాసం ఉంటున్నాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమారైలు, ముగ్గురు కుమారులు ఉన్నారు.

హత్య వేకువ ఝామున...
మసీదులోనే నివాసం ఉంటున్నమౌజస్ ఎప్పటిలాగానే గురువారం రాత్రి కూడా మసీదులోనే నిద్రించారు. శుక్రవారం వేకువజామున ఫజా కోసం గేటు కీపర్ గౌస్ 4.30 గంటలకు మసీదులోకి వెళ్లాడు. రక్తపు మడుగులో ఫరూక్ పడి ఉండటాన్ని, పక్కనే ఖురాన్, ఇతర వస్తువులను తగులబెట్టి ఉండటాన్ని గమనించాడు. ఈ విషయాన్ని పోలీసులకు, ముస్లిం పెద్దలకు సమాచారం అందించాడు.ఈ హత్య శుక్రవారం వేకువ జామున జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దుండగులు కర్రతో కొట్టి చంపినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఘటనా స్థలాన్ని, చుట్టుప్రక్కల ప్రాంతాలను రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పి బి.రాజకుమారి పరిశీలించారు. క్లూస్ టీమ్తో ఆధారాలు సేకరించారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు.

ముస్లింల ఆగ్రహం...
గొడవలు జరిగే అవకాశ ఉందన్న కారణంగా ముస్లిం పెద్దలు ఘటనా స్థలానికి చేరుకోక ముందే పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో పోలీసుల తీరుపై ముస్లిములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచనామా నిర్వహించకుండా మృతదేహాన్ని ఎలా తీసుకెళ్లారని ప్రశ్నించారు. హత్య విషయం తెలుసుకున్న నగరం లోని ముస్లిములు పెద్దసంఖ్యలో ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. లాలాచెరువు సెంటర్లోని 16వ నంబర్ జాతీయ రహదారిపై బైఠాయించారు. అక్కడే నమాజు చేసి నిరసన తెలిపారు. దీంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.

మత కల్లోలాలు సృష్టించేందుకే...
మౌజస్ దారుణ హత్యని ముస్లి నేతలు ఖండించారు. వెల్ఫేర్ పార్టీ అధ్యక్షుడు షబ్బీర్ అహ్మద్ మాట్లాడుతూ ముస్లిములను భయపెట్టేందుకే మత గురువును సంఘ విద్రోహ శక్తులు హత్య చేశాయని విమర్శించారు. నిందితులను తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం నగరంలో ముస్లింలు, హిందువుల మధ్య గొడవలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న శక్తులపై నిఘా ఉంచాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అల్లరి మూకలే ఈ హత్యకు కుట్ర పన్నాయని ఆరోపించారు.

ఉద్రిక్తత...లాఠీఛార్జి
శుక్రవరం ఉదయం 9 గంటల నుంచి రాత్రి వరకూ ముస్లిములు రాజమహేంద్రవరంలోని లాలాచెరువు వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించి ఆందోళన చేయడంతో రాత్రి 10 గంటల సమయంలో పోలీసులు లాఠీఛార్జి చేశారు. ముస్లిములందరినీ చెదరగొట్టారు. వారి టెంట్లను తొలగించారు. పోలీసుల లాఠీఛార్జిలో కొందరు ముస్లిములకు స్వల్పగాయాలయ్యాయి. అనంతరం ట్రాఫిక్ క్రమబద్ధీకరణ జరిగింది. దీంతో, కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి.

హోంమంత్రి రాజీనామా చేయాలి...
మౌజస్ అహ్మద్ ఫరూఖ్ హత్య నేపథ్యంలో సంఘటనా స్థలాన్ని సందర్శించకుండా ముఖం చాటేసిన హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తన పదవికి తక్షణం రాజీనామా చేయాలని ముస్లిములు డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించకపోవడం అన్యాయమన్నారు. ఆందోళన చేస్తున్న ముస్లిములకు వివిధ పార్టీలు,సంఘాలు సంఘీభావం ప్రకటించాయి.

సిఎం చంద్రబాబు ప్రకటన...
రాజమండ్రిలో మౌజస్ హత్య విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఈ కేసు గురించి ఇప్పటికే డీజీపీతో మాట్లాడానని చెప్పారు. ఈ హత్య కేసులో నిందితులను త్వరలోనే పట్టుకుని, కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. మృతుడికి సంబంధించిన వివరాలను పోలీసులు తెలుసుకుంటున్నారని, కేసు పురోగతిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. వ్యక్తిగత కక్షలతో ఈ హత్య చేశారా? లేక రాష్ట్రంలో అలజడి సృష్టించాలనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలకు పాల్పడ్డారా? అనే విషయం పోలీసు దర్యాప్తులో తేలుతుందని చంద్రబాబు అన్నారు.












Click it and Unblock the Notifications