భయంతో వణుకుతున్న ఓ ఊరు: స్కూల్లో అసలేం జరిగింది?
అమరావతి: అంతుబట్టిన కారణాలతో ఆకివీడు మండలం చినకాపవరం గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూలుకు చెందిన 42 మందికి పైగా విద్యార్ధినులు ఒకరి తర్వాత మరొకరు అస్వస్థతకు గురైన సంఘటన నుంచి గ్రామం ఇంకా తేరుకోలేదు. విద్యార్ధినుల అస్వస్థత కారణంగా శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు పాఠశాలకు సెలవు ప్రకటించారు.
దీంతో విద్యార్ధినుల్లో కొంత మంది కోలుకున్నారు. మరికొంత మంది అస్వస్థతతో బాధపడుతున్నారు. దీంతో గ్రామానికి చెందిన విద్యార్ధులంతా భయంతో వణికిపోతున్నారు. ఎవరైతే విద్యార్ధులకు ఈ వ్యాధి సోకిందో వారు కళ్లు తిరిగి పడిపోవడం, కాళ్లు చేతులు కొంకర్లు పోవడం, తలపోటు, కడుపు నొప్పి, ఆయాసం, ఛాతిలో నొప్పి వంటి, వాంతులు, వికారం వంటి సమస్యలకు గురవుతున్నారు.
అయితే విద్యార్ధినులకు సడన్గా ఇలా అస్వస్థతకు గురి కావడానికి గల కారణాలు ఏమన్నది ఇంకా అంతు చిక్కలేదు. వైద్యులు మాత్రం ఇది మాస్ హిస్టీరియా అయి ఉండవచ్చని చెబుతుండగా.. మీథేన్ గ్యాస్ కారణమై ఉండొచ్చనే అనుమానాలూ కూడా వ్యక్తమవుతున్నాయి.
విద్యార్ధులంతా కూడా ఆరు నుంచి పదో తరగతి మధ్య చెందిన వారు కావడం విశేషం. స్కూల్లో విద్యార్ధులకు టీచర్ల పాఠాలు చెబుతున్న క్రమంలో ఒక విద్యార్ది నుంచి మరో విద్యార్దికి వ్యాపించి ఇలా సుమారు 45 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. జులై 18వ తేదీన తొలుత 18 మంది ఆ తర్వాత 10 మంది విద్యార్ధులు అస్వస్థతకు గురవ్వగా, 20వ తేదీన 15 మంది దీని బారిన పడ్డారు.

వీరిలో ముగ్గురి పరిస్థతి కాస్తంత విషమంగా ఉండటంతో భీమవరంలోని ప్రైవేట మెడికల్ కేర్లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఈ సంఘటనపై వెంటనే స్పందించిన జిల్లా వైద్యాధికారులు గ్రామానికి నలుగురు సభ్యులతో కూడిన వైద్యలు బృందాన్ని పంపించడం జరిగింది.
దీంతో గ్రామంలోని స్కూల్లో చదువుతున్న విద్యార్ధులు ఇంటికి వెళ్లి నీటి నమూనాలను సేకరించి విద్యార్ధుల అస్వస్థతకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. గ్రామ శివారులో ఉన్న హైస్కూల్కు సమీపంలో ఐస్ ఫ్యాక్టరీ ఉందని, దాని కూలర్స్ అవుట్లెట్ నుంచి మీథేన్ గ్యాస్ లీకై ఇలా అవుతోందేమోనని గ్రామస్తులు చెబుతున్నారు.
ఈ సంఘటనపై పెద కాపవరం పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ టి. రవి కిరణ్ రెడ్డి మాట్లాడుతూ ఇది మాస్ హిస్టీరియా అయి ఉండవచ్చని అన్నారు. అస్వస్థతకు గురైన విద్యార్ధలంతా ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన తెలిపారు. అస్వస్థతకు గురై కోలుకుంటున్న విద్యార్థినుల్లో కొందరు ఇప్పటికీ భరించలేనంత తలనొప్పి వస్తోందని చెబుతున్నారు.
మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా మెడికల్, హెల్త్ ఆఫీసర్ కె. కోటీశ్వరి మాట్లాడుతూ స్కూలు విద్యార్ధులు అస్వస్థతకు గురైన సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. గతంలో కొవ్వూరు మండలం మద్దూరులంకలోనూ ఇటువంటి ఘటన చోటుచేసుకుందని చెబుతున్నారు. అప్పట్లో అక్కడ బెల్లం ఊటనుంచి వెలువడిన వాయువుల వల్ల పిల్లలు కళ్లు తిరిగిపడిపోయిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications