షాకింగ్ : చిత్తూరు జిల్లాలో 74మంది గ్రామ వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా .. వారి వేధింపులే కారణమట !!
చిత్తూరు జిల్లాలో 74 మంది విలేజ్ వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాలలో, పాకాల మండలంలో పనిచేస్తున్న విలేజ్ వాలంటీర్లు ఎంపీడీవో కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగారు. అంతేకాదు సామూహిక రాజీనామాలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే..
ఏపీ పోలీస్ శాఖకు ఐదు జాతీయ అవార్డులు ; టెక్నాలజీలో సత్తా చాటిన ఏపీ పోలీస్ : డీజీపీ గౌతమ్ సవాంగ్
పంచాయతీ ఈవో, వైసీపీ నేతలు వేధిస్తున్నారని గ్రామ వాలంటీర్ల ఆందోళన
చంద్రగిరి నియోజకవర్గంలోని పాకాలలో పంచాయతీ ఈవో కుసుమకుమారి, స్థానిక అధికార పార్టీ నాయకులు తమను తీవ్రంగా వేధింపులకు గురి చేస్తున్నారని గ్రామ వాలంటీర్లు, ఈవో కుసుమకుమారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీవో కార్యాలయం దగ్గర ఆందోళన వ్యక్తం చేశారు. తాము తమ పరిధిలో ప్రశాంతంగా పని చేసుకోలేకపోతున్నామని, అధికార పార్టీ నేతలు కూడా తమను వేధిస్తున్నారని వారు ఆరోపించారు. గ్రామ పంచాయతీకి ఈవోగా కుసుమకుమారి ఉన్నంతవరకూ తాము విధులకు హాజరు అయ్యేది లేదని వాలంటీర్లు నిరసన తెలియజేశారు.
రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన 76మంది వాలంటీర్లు
మొత్తం 76 మంది గ్రామ వాలంటీర్లు రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. గ్రామ పంచాయతీ ఈవోగా ఉన్న అధికారిపై చర్యలు తీసుకునేంతవరకు తాము ఆందోళన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ఇక వైసీపీ నేతలు సైతం తమ వేధింపులను ఆపాలని, తమ పని తాము చేసుకోనివ్వాలని వాలంటీర్లు డిమాండ్ చేశారు. ఈవో అసభ్య పదజాలంతో తమను దూషిస్తున్నారని, తమని మానసికంగా చిత్రవధ కు గురి చేస్తున్నారని, తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని, ఎంత పని చేసినా ఏదో ఒకటి అని అవమానిస్తున్నారని వారు ఆరోపణలు గుప్పించారు. ఇదే సమయంలో స్థానిక నాయకులు అందరూ వాలంటీర్ల పై పెత్తనం చెలాయిస్తున్నారు అంటూ నిప్పులు చెరిగారు.
ఈవోపై చర్యలకు డిమాండ్.. స్థానిక నాయకుల కట్టడికి విజ్ఞప్తి
స్థానిక నాయకులను కట్టడి చేయాలని, ఉన్నతాధికారులు ఈవోపై తగిన చర్యలు తీసుకోవాలని గ్రామ వాలంటీర్లు డిమాండ్ చేశారు. ఈమేరకు తహసిల్దార్ కు తన ఫిర్యాదు పత్రాన్ని అందజేసిన వాలంటీర్లు తమ డిమాండ్లను పరిష్కరించకుంటే విధులకు హాజరయ్యేది లేదని తేల్చి చెప్పారు. మొత్తం 76 మంది వాలంటీర్లు ఒక్కసారిగా రాజీనామా చేస్తున్నామని ప్రకటించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే గతంలోనూ పోలీసుల పై ఆరోపణలు గుప్పిస్తూ విశాఖపట్నం జిల్లాలో గ్రామ వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేశారు.
గతంలో విశాఖ మన్యంలో 32 మంది గ్రామ వాలంటీర్లు రాజీనామా.. పోలీసులపై ఆరోపణలు
విశాఖ మన్యంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బూదరాళ్ళ పంచాయతీకి చెందిన 32 మంది గ్రామ వాలంటీర్లు రాజీనామా చేశారు. తాము విధులు నిర్వర్తిస్తున్న మారుమూల ప్రాంతంలోని గిరిజన గ్రామాలకు కనీస రహదారి సౌకర్యాలు కూడా లేవని, రవాణా సౌకర్యాలు లేని ఆ గ్రామాలలో మౌలిక వసతులు లేకున్నా తాము విధులు నిర్వర్తిస్తున్నామని మావోయిస్టులతో సంబంధాలు కొనసాగిస్తున్నామన్న అనుమానంతో పోలీసులు తమను నిత్యం వేధింపులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అసలే వసతులు లేక ఇబ్బందులతో ఉద్యోగాలు చేస్తున్న తమకు, పోలీసుల వేధింపులు మరింత ఇబ్బందికరంగా మారాయని గత్యంతరం లేకనే రాజీనామాలు చేస్తున్నామని వారు అప్పుడు చెప్పిన పరిస్థితి .పోలీసులు వేధింపులు లేకుండా చర్య తీసుకుంటే తాము విధుల్లో చేరి పని చేసుకుంటామని వారు పేర్కొన్న సంగతి తెలిసిందే.