వెళ్లిపోండి: జగన్ చిచ్చుపై బొత్స గరం, కడిగిపారేసిన జెసి
హైదరాబాద్: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు పార్టీ నాయకుడు జెసి దివాకర్ రెడ్డి ఫోన్ చేసి కడిగి పారేశారు! విజయనగరం జిల్లాలో వరద బాధితులను పరామర్శిస్తున్న బొత్సకు జెసి ఫోన్ చేశారు. జిల్లాలో వరద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో బొత్స ఆయన చేసిన ఫిక్సింగ్ వ్యాఖ్యలను ప్రస్తావించారు.
బొత్స ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో అధిష్టానం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని మీలాంటి సీనియర్ నేతలు మాట్లాడటమేమిటని అసహనం వ్యక్తం చేశారు. ఇష్టం ఉంటే పార్టీలో ఉండవచ్చు లేదంటే వెళ్లిపోవచ్చని మాట్లాడారు. అపవాదులు వేయడం సరికాదన్నారు. బొత్స వ్యాఖ్యలకు అంతకంటే సీరియస్గా జెసి స్పందించారట.
తాము పుట్టింది కాంగ్రెసు పార్టీలో, పెరిగింది కాంగ్రెసు పార్టీలో అని, చచ్చి కంపు కొడుతున్న కాంగ్రెసు పార్టీలోనే కొనసాగామన్నారు. ఏం జరిగినా తాము మొదటి నుండి కాంగ్రెసు పార్టీలోనే ఉన్నామని అందుకే మాట్లాడుతున్నానని చెప్పారు. తాను పార్టీ వీడే వాడిని కాదని చెప్పారు.
జగన్తో కాంగ్రెసు కుమ్మక్కైన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఉన్న దానిని చెబితే గెటౌట్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారట. మొదటి నుండి కాంగ్రెసులో ఉన్న తనకు జరుగుతున్న పరిణామాల పైనే ఆవేదనగా ఉందని చెప్పారు. కాగా, అనంతరం బొత్స.. జెసితో మ్యాచ్ ఫిక్సింగ్ విషయమై మాట్లాడలేదని వివరణ ఇచ్చారు.