స్టీఫెన్ కేసీఆర్ వద్దకెందుకెళ్లారు: అత్తారింట్లో మత్తయ్య, ఏపీకి టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల షాక్!
విజయవాడ: తాను ఆంధ్రప్రదేశ్ మంత్రుల సంరక్షణలో లేనని ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడు జెరూసలేం మత్తయ్య చెప్పారు. తాను తన భార్య స్వస్థలం గుంటూరులోని అత్తగారి ఇంట్లో ఉన్నానని ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర పోలీసుల పైన నమ్మకం లేకనే తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన అత్తవారి ఇంట్లో ఉంటున్నానని ఆయన చెప్పారు. మంత్రులు తనకు రక్షణ ఇచ్చి ఆశ్రయం కల్పించినట్లు జరుగుతున్న ప్రచారం ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్నదని చెప్పారు.
స్టీఫెన్ సన్ ఇచ్చిన వాంగ్మూలంలో తన పేరు లేదని, అందుకే తనను నిర్దోషిగా గుర్తించాలన్నారు. స్టీఫెన్ సన్ వాంగ్మూలం ఇచ్చే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ను కలవడం వెను ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. స్టీఫెన్ వాంగ్మూలంలో తప్పులను గుర్తించి కేసు నమోదు చేయాలన్నారు.
కాగా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రెండో రోజు సిట్ బృందం విచారణ కొనసాగుతోంది. విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్లో ప్రత్యేక బృందం అధికార్లు సర్వీస్ ప్రొవైడర్లను విచారిస్తున్నారు. చిత్తూరు ఎస్పీ, సిట్ అధికారి జీ శ్రీనివాస్, అదనపు ఎస్పీలు దామోదర్, నరసింహారావుల ఆధ్వర్యంలో విచారణ జరగుతోంది.

ఒక్కరొక్కరుగా సర్వీస్ ప్రొవైడర్లు వస్తున్నారు. ఎయిర్టెల్, ఐడియా, ఎయిర్సెల్, బీఎస్ఎన్ఎల్కు చెందిన సంస్థల ప్రతినిధులు సిట్ ఎదుట హాజరయ్యారు. టాపింగ్ వ్యవహారంలో రహస్యంగా టాపింగ్ చేసిన నెంబర్లకు ఎక్కడెక్కడ నుంచి కాల్స్ వచ్చాయనే వివరాలు, కాల్ రికార్డులు, కాల్ డేటాలను అధికార్లకు సమర్పించినట్లు తెలుస్తోంది.
సిట్ ఆదేశాలు తమకు వర్తించవని, విచారణ పరిధి లేదంటూ కొందరు సర్వీసు ప్రొవైడర్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఏపీ సర్కిల్ పేరిటే వారు రెండు రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్నందున విచారణ పరిధి తమకు కూడా ఉంటుందని సిట్ అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications