మేయర్ అనురాధ దంపతుల హత్య: ఎవరీ చింటూ?
చిత్తూరు: మేయర్ అనురాధ దంపతుల హత్య కేసులో చింటూను కీలక సూత్రధారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. నిజానికి, అనురాధ హత్య జరిగిన వెంటనే పోలీసులు చింటూ గురించి ఆలోచన చేశారు. మేయర్ దంపతుల అనుచరులు కూడా నేరుగా వెళ్లి చింటూ కార్యాలయానికి నిప్పు పెట్టారు. అతని ఆస్తులపై దాడులు చేశారు. దాంతో ఎవరీ చింటూ అనేది ఆసక్తికరమైన విషయంగా మారింది.
చింటూ అసలుపేరు చంద్రశేఖర్. అనురాధ భర్త మోహన్ అక్క సక్కుబాయి కుమారుడు. దాంతో అతను అనురాధకు మేనల్లుడవుతాడు. మెరైన్ ఇంజనీరింగ్ చేశాడు. ముంబైలో ఉద్యోగం చేస్తూ వచ్చాడు. ఆ క్రమంలో తొలిసారి 2007లో అతని పేరు ప్రముఖంగా వినిపించింది. మాజీ ఎమ్మెల్యే సీకేబాబుపై ఆ ఏడాది రెండుసార్లు హత్యా ప్రయత్నం జరిగింది. సీకేబాబుని టార్గెట్ చేసింది చింటూనే కావచ్చునని అప్పట్లో అనుకున్నారు.
Photos: మేయర్ అనూరాధ దంపతుల హత్య
2005లో చింటూ మేనమామ, టీడీపీ నేత కటారి మోహన్పై హత్యాయత్నం జరిగింది. దీనికి ప్రతీకారంగానే సీకే బాబుని చింటూ చంపాలని చూశాడంటూ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. మేనమామతో పాటు అజ్ఞాతంలో ఉన్న చింటూ 2011లో చిత్తూరు జిల్లాకు వచ్చాడు.

కేసుల్లో విచారణకు హాజరవుతూనే అతను సొంత వ్యాపారాలను పెంచుకున్నాడు. రాజకీయ దృష్టితో చింటూ,బలిజ యువజన సేవాసమితిని నడిపిస్తున్నాడు. నిరుటి ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. మేనత్త అనూరాధ చిత్తూరు నగర మేయర్ అయ్యారు. అప్పటినుంచి జిల్లా రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించడానికి ప్రయత్నించాడు. అయితే ఈ విషయంలో కటారి కుటుంబం నుంచి ప్రోత్సాహం లభించలేదని చెబుతారు.
కార్పొరేషన్ వ్యవహారాల్లో, నగర రాజకీయాల్లో జోక్యంకోసం ఉత్సహపడిన చింటూ కటారి మోహన్ కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడంతో నిరాశకు లోనైనట్లు చెబుతారు. దాంతోనే కోపం పెంచుకుని అనురాధ దంపతులను అతను లక్ష్యం చేసుకున్నాడని అంటున్నారు. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో మేనత్త మీద పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు చెబుతారు.
మేయర్ వాహనానికి నిబంధనలకు విరుద్ధంగా బ్లూ లైట్, సైరన్ వినియోగిస్తున్నారనే ఫిర్యాదు కూడా అతను చేశాడు. కుటుంబంలో రేగిన వివాదమే కటారి దంపతుల హత్యకు దారి తీసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.












Click it and Unblock the Notifications