పవన్ అభ్యర్థి!: తేలిపోయిన జగ్గారెడ్డి, సునీత పైన..
హైదరాబాద్: మెదక్ లోకసభ ఉప ఎన్నికల్లో తెరాస, బీజేపీల మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుందని అందరూ భావించారు. అయితే, అది తారుమారైంది. బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి ఏ సమయంలోను తెరాస అభ్యర్థికి పోటీని ఇవ్వలేదు. అంతేకాదు, ఏమాత్రం పోటీ ఇవ్వదని భావించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీతా లక్ష్మా రెడ్డి రెండో స్థానంలో నిలవగా, జగ్గారెడ్డి మూడో స్థానంలో నిలిచారు.
ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి ఎంపిక ద్వారానే బీజేపీ తప్పులో కాలేసిందని, అదే సమయంలో సునీతకు సానుభూతి కలిసి వచ్చిందంటున్నారు. బీజేపీ జగ్గారెడ్డిని నిలబెట్టడం ద్వారా తన గోతిని తానే తీసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల ప్రచారంలో విమర్శిస్తూ వచ్చింది.
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సూచించిన జగ్గారెడ్డిని అప్పటికి అప్పటికీ పార్టీలోకి తీసుకొని అభ్యర్థిగా ప్రకటన చేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ, బీజేపీ-టీడీపీలు మాత్రం జగ్గారెడ్డియే అసలైన అభ్యర్థి అని భావించాయి.
సంగారెడ్డిలో జగ్గారెడ్డికి బాగా పట్టు ఉంది. అలాంటి సంగారెడ్డిలోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలవని జగ్గారెడ్డి మెదక్ నుండి ఎలా గెలుపొందుతారని తెరాస ప్రశ్నించింది. జగ్గారెడ్డి పైన సొంత నియోజకవర్గంలోనే వ్యతిరేకత ఉందని చెబుతున్నారు. టీడీపీతో పొత్తు కూడా బీజేపీని దెబ్బతీసిందని అంటున్నారు.
అంతేకాకుండా.. జగ్గారెడ్డిని సమైక్యవాదిగా చిత్రీకరించడంలో తెరాస విజయవంతమైందని, ఆ కారణంగానే ఆయన మూడోస్థానానికి పడిపోయారని మరికొందరు చెబుతున్నారు. జగ్గారెడ్డికి పట్టు ఉంటుందని భావిస్తున్న సంగారెడ్డిలోనే ఆయనకు మెజార్టీ రాలేదని గుర్తు చేస్తున్నారు. బీజేపీ సంగారెడ్డి, పటాన్చెరుల పైన భారీగా ఆశలు పెట్టుకుంది. అయితే, అక్కడ జగ్గారెడ్డిని ఆదరించలేదు.
మెదక్లో బీజేపీ మూడోస్థానానికి పడిపోయింది. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మా రెడ్డి కంటే జగ్గారెడ్డికి 25వేల పైచిలుకు ఓట్లు తక్కువగా వచ్చాయి. మెదక్ ఉప ఎన్నిక ద్వారా తెరాస సత్తాచాటగా, జగ్గారెడ్డి పైన వ్యతిరేకత, సునీతా లక్ష్మా రెడ్డి పైన సానుభూతి కనిపించిందని చెబుతున్నారు. కేసీఆర్కు ధీటైన వ్యక్తి జగ్గారెడ్డి అని ప్రచారంలో టీడీపీ, బీజేపీలు చెప్పాయి. ఉప ఎన్నిక ద్వారా జగ్గారెడ్డి తేలిపోయారని అంటున్నారు.