తెలంగాణ త్యాగాలు: కలెక్టర్ స్మితా సబర్వాల్ భావోద్వేగం
మెదక్: మెదక్ జిల్లా కలెక్టర్ స్మిత్ సబర్వాల్ భావోద్వేగానికి గురయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల కుటుంబాలను ఆమె సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సంఘటనలు తలుచుకొని ఆమె ఉద్వేగానికి లోనయ్యారు.
తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వారిని, అమరవీరుల తల్లిదండ్రుల పరిస్థితిని తలచుకుని ఆమె కంట తడిపెట్టారు. అమరవీరుల తల్లులు తమ గోడును ఆమెకు వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కదిలిపోయారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరాన్ని ఆమె చెప్పారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాంత చారీ తల్లి మాట్లాడుతూ.. తన బిడ్డలాంటి చాలామంది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించారన్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వానిదే అని చెప్పారు.
హైదరాబాదును ఐటి రంగంలో మేటిగా చేస్తాం: కెటిఆర్
హైదరాబాదును ఐటీ రంగంలో మేటిగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హైదరాబాదులో అన్నారు. తెలంగాణ కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాదును పారిశ్రామికంగా కూడా ముందుకు తీసుకుపోతామన్నారు. ఉద్యమకారులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామన్నారు.