సోమవారం జగన్ పాదయాత్రకు విరామం...పార్టీ ఎంపీలతో సమావేశం
గుంటూరు: గుంటూరు జిల్లాలో ప్రజా సంకల్పయాత్రలో ఉన్న వైసిపి అధినేత జగన్ మోహన్రెడ్డితో సోమవారం సాయంత్రం ఆ పార్టీ ఎంపీలు సమావేశం కానున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని ముప్పాళ్ళలో ఈ భేటీ జరగనున్నట్లు తెలిసింది.
తమ పార్టీ అధ్యక్షుడు జగన్ తో జరిగే ఈ కీలక సమావేశానికి వైసీపీకి చెందిన ఏడుగురు ఎంపీలు హాజరవుతారని ఆ పార్టీ గుంటూరు జిల్లా నేతలు తెలిపారు. ఈ సమావేశంలో జగన్ ప్రత్యేక హోదా అంశంతో పాటు తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎంపీలు పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు సమాచారం. వైసిపి ముందుగానే ప్రకటించినట్లుగా ఏప్రిల్ ఆరో తేదీన వైసీపీ ఎంపీలతో రాజీనామా చేసే అంశంపై కీలక నిర్ణయం ఈ భేటీలోనే తీసుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కొనసాగుతున్నజగన్ 120 వ రోజు పాదయాత్ర ఆదివారం నరసరావుపేట మండలం నుంచి ప్రారంభమై సత్తెనపల్లి నియోజకవర్గంలోని గోళ్ళపాడు మీదుగా ముప్పాళ్ళకు చేరుకుంది. మరోవైపు జగన్ పాదయాత్రకు శ్రీరామనవమి పండుగ సందర్భంగా సోమవారం విరామం ఇచ్చారు