చిరంజీవితో సై, పవన్ వ్యాఖ్యల వెనుక..!: వేగంగా మారుతున్న పరిణామాలు
మెగా సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్లు రాజకీయంగా ఒక్కటవుతున్నారా? అంటే ఇటీవలి పరిణామాలు చూస్తుంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
విజయవాడ: మెగా సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్లు రాజకీయంగా ఒక్కటవుతున్నారా? అంటే ఇటీవలి పరిణామాలు చూస్తుంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం అయినప్పటి నుంచి ఇరువురి మధ్య మనస్పర్థలు ఉన్నాయి.
చిరు, పవన్లో చాలా రోజుల పాటు ఒక వేదిక పైన కనిపించక పోవడం, మెగా ఫ్యామిలీ వేడుకల్లో అభిమానులు పవన్ కళ్యాణ్ గురించి పదేపదే నినాదాలు చేసిన సమయంలో నాగబాబు, అల్లు అర్జున్ ఆగ్రహించడం.. వంటివి జరిగాయి.

మౌనం తర్వాత..
ఈ విషయమై మెగా సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్లు చాలా రోజుల వరకు స్పందించలేదు. ఆ తర్వాత మాత్రం తమ దారి వేరు అయినా, లక్ష్యాలు ఒక్కటేనని చెప్పారు. ఆ తర్వాత జనసేన పార్టీ పైన, పవన్ సిద్ధాంతం పైన చిరు ప్రశంసలు కూడా కురిపించారు.

దారులు వేరైనా..
కేవలం రాజకీయంగానే తమ మధ్య వేరు దారి ఉందని, కుటుంబంగా మాత్రం ఒక్కటేనని వారు పలుమార్లు చెప్పారు. అయితే, మీడియాలో మాత్రం ఇద్దరి మధ్య మనస్పర్థలు అనే ప్రచారం బాగా జరిగింది.

ఇష్టం లేకే
అన్నయ్యకు దూరమై, ఆ తర్వాత జనసేన పార్టీ స్థాపించారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో టిడిపి - బిజెపి కూటమికి మద్దతు పలికారు. చిరు ఉన్న కాంగ్రెస్ పార్టీని కాదని ఆయన టిడిపి - బిజెపి కూటమికి మద్దతు పలకడం గమనార్హం.

దూరం జరుగుతున్న పవన్
కొద్ది రోజులుగా రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీకి, దాని కోసం ఉద్యమించని టిడిపికి పవన్ కళ్యాణ్ క్రమంగా దూరం జరుగుతున్నారు. హోదా కోసం ఎవరితోనైనా కలిసి పని చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు.

జగన్తో కూడా కలిసేందుకు సిద్ధమన్న పవన్ వ్యాఖ్యల వెనుక..
ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు కలిసి రావాలని, లెఫ్ట్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలతో కూడా కలిసి పని చేసేందుకు తాను సిద్ధమని పవన్ ఇటీవల చెప్పారు. హోదా పైనే ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. అదే ఆయుధంగా 2019 ఎన్నికలను పవన్ టార్గెట్ చేస్తున్నారు. జగన్తోనైనా కలిసి పని చేస్తానని పవన్ చెప్పడం, లెఫ్ట్తో చర్చల వంటి పరిణామాలను గమనిస్తుంటే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ - లెఫ్ట్తో పవన్ దోస్తీ కడతారా అనే చర్చ సాగుతోంది.

నాగబాబు వ్యాఖ్యలు
ఇటీవల నాగబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... రాజకీయాల్లో తాను పని చేయాల్సి వస్తే జనసేన తరఫున పని చేస్తానని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. అంతకుముందు అన్నయ్య వెంటే ఉంటానని చెప్పిన నాగబాబు జనసేన వైపు మరలడం గమనార్హం. అప్పుడే మెగా సోదరులు రాజకీయంగా కూడా కలిసిపోతున్నట్లుగా చాలామంది భావించారు. టిడిపి - బిజెపికి దూరం కావడం కూడా అందుకు కారణం. 2019లో లెఫ్ట్ - కాంగ్రెస్ - జనసేన కలిసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

ఇప్పుడు సినిమా..
మొన్నటి దాకా చిరు, పవన్లు ఒకే వేదిక పైన కనిపించలేదు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా సమయంలో చిరంజీవి వచ్చారు. ఆ తర్వాత ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఆడియోకు పవన్ రాకపోయినప్పటికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు ఏకంగా ఇరువురు.. మల్టీస్టారర్లో నటించబోతున్నారు. సినిమాల పరంగనే కాకుండా రాజకీయంగాను మెగా సోదరులు ఏకమవుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications